Women Safety AP: మహిళల భద్రతకు శక్తి
ABN , Publish Date - May 20 , 2025 | 05:38 AM
ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత కోసం 164 శక్తి బృందాలు, 900 స్పాట్లలో నిఘా కొనసాగుతున్నది. గత పది నెలల్లో 169 మంది నేరాల కోసం జైలు శిక్షలు పొందారు.

యాప్ను డౌన్లోడ్ చేసుకున్న 1.52 కోట్ల మంది
రాష్ట్రంలో164 బృందాలు.. 900 చోట్ల నిఘా
మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలే: డీజీపీ
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలపై నేరాలకు పాల్పడిన కేసుల్లో గత పది నెలల్లో 169 మందికి జైలుశిక్షలు పడ్డాయని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రతి మహిళ, బాలిక, చిన్నారికి అత్యంత భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ పని చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 164 శక్తి బృందాలు ఏర్పాటు చేసి 900 స్పాట్లలో నిఘా విస్తృతం చేశామన్నారు. అధునాతన ఫ్యూచర్లతో రూపొందించినశక్తియాప్కు 1.52 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. 11.6 లక్షల కాల్స్ రాగా, అందులో అత్యవసరంగా స్పందించాల్సిన 34,192 ఫోన్లకు పోలీసులు సకాలంలో స్పందించినట్లు పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి 90 శాతం సమస్యలు పరిష్కరించినట్టు, 3,193 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రత కోసం శక్తి బృందాలను మఫ్టీలో ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని, మహిళలపై జరిగే వ్యవస్థీకృత నేరాల కట్టడికి ‘ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్’ ఐజీ రాజకుమారి నేతృత్వంలో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. నేరాల నుంచి తప్పించుకునేలా మహిళలకు 12,119 అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈవ్ టీజింగ్, అత్యాచారాలు, హత్యలు, గృహహింస, వరకట్న హత్యలు, లైంగిక వేధింపులు, దాడులు, దూషణలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకున్నట్లు తెలిపారు. మహిళలు, యువతులు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.