Share News

Nara Lokesh: నిరసన తెలిపితే సంకర జాతా

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:20 AM

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు.. సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా అని వైసీపీ నాయకులపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ‘ఎక్స్‌’లో ఆయన స్పందించారు.

Nara Lokesh: నిరసన తెలిపితే సంకర జాతా

  • మహిళల జోలికొస్తే చర్యలు తప్పవు

  • వైసీపీ నేతలకు లోకేశ్‌ హెచ్చరిక

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు.. సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా అని వైసీపీ నాయకులపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ‘ఎక్స్‌’లో ఆయన స్పందించారు. ‘తమను అవమానించిన వారి ఫొటోల వద్ద మహిళలు నిరసన తెలియజేస్తే.. వారు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు.. సంకర జాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. జగన్‌ తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారు. మహిళల జోలికొస్తే చట్టప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం’ అని తేల్చిచెప్పారు.

  • జర్నలిస్టు ముసుగులో చీడపురుగులు

  • అనగాని, భూపతిరాజు, కొల్లు, ఆనం ధ్వజం

జగన్‌ మీడియాలో అమరావతి మహిళలపై చేసి న అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఆడబిడ్డలంటే సాక్షి మీడియాకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ముసుగులో చీడపురుగులు ఉన్నారంటూ విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమవరంలో మాట్లాడుతూ, కృష్ణంరాజు క్యారెక్టర్‌ ఉన్న వ్యక్తి కాదన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లిలో మాట్లాడుతూ, ‘ఆడబిడ్డలను కించపర్చేవిధంగా చర్చావేదికలు నిర్వహిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది’ అని హెచ్చరించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహానందిలో మాట్లాడుతూ, ‘మీడియా విశ్లేషణ పేరుతో మహిళలను దుర్భాషలాడటం సృష్టి ధర్మానికి విరుద్ధం.’ అని మండిపడ్డారు. మంత్రి అనగాని తిరుపతిలో మాట్లాడుతూ, ‘మా ప్రభుత్వం ఎవరినీ టార్గె ట్‌ చేయలేదు. కొంతమంది జర్నలిస్టు ముసుగులో చీడపురుగుల్లా తయారయ్యారు. వైసీపీ సోషల్‌ మీడియాపై ప్రత్యేక దృష్టిపెట్టాం’ అని హెచ్చరించారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుకు మద్దతుగా వైసీపీ నేత జగన్‌ రెండు పేజీల ట్వీట్‌ పెట్టడం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కొమ్మినేని, కృష్ణంరాజు సభ్యత్వం తీసుకోని వైసీపీ కార్యకర్తలు’ అని వర్ల మండిపడ్డారు.

  • ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం, హేయం

  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: వెంకయ్య

‘అమరావతిపై చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవని. సభ్యసమాజం సహించలేనివి’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. క్షమించరాని నేరం. బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేశారు.


  • మీ మహిళలను ఇలాగే అంటారా?

  • ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం: శైలజ

‘సాక్షి చానల్‌లో నిర్వహించిన చర్చా వేదికలో అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి కృష్ణంరాజు చాలా అసభ్యంగా మాట్లాడారు. ఇదే మాటలను మీ ఇళ్లలో మహిళలను అనగలరా? సాక్షి చానల్‌, పత్రిక లైసెన్స్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రెస్‌ కౌన్సిల్‌కు లేఖ రాస్తాం’ అని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు.

  • దురుద్దేశంతోనే..: ఆలపాటి సురేశ్‌

అమరావతిపై విషం చిమ్మే ఉద్దేశంతోనే కొమ్మినేని శ్రీనివాస్‌ డిబేట్‌లో మహిళలపై అసభ్యంగా మాట్లాడారని అనిపిస్తోందంటూ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేశ్‌ కుమార్‌ అన్నారు. ‘ ఆంగ్ల పత్రిక కథనంలో ఎక్కడా లేని ప్రస్తావన ఆ చర్చలో ఎందు కు తీసుకొచ్చారో వివరణ ఇవ్వాలి.’ అన్నారు.

  • ఆ వ్యాఖ్యలు తెలుగు మహిళలపై దాడే

  • ఏపీ, టీజీ ఎంఎస్ఓ ఫెడరేషన్‌

అమరావతి మహిళలపై సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన అవమానకర వ్యాఖ్యలను ఏపీ, టీజీ మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్లు(ఎంఎస్.ఓ) ఫెడరేషన్‌ ఖండించిం ది. ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె.శ్రీనివాసరావు, ప్రతినిధులు జి.సూర్యనారాయణ, కె.గౌరిశంకర్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టు కృష్ణంరాజు, యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వారి వ్యాఖ్యలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, బాధిస్తున్నాయని తెలిపారు. చర్చలు జరిపేటప్పుడు బాధ్యతతో మెలగాలని ఈ సందర్భంగా అన్ని మీడియా వేదికలను కోరారు.

Updated Date - Jun 10 , 2025 | 04:22 AM