Social Media Case: పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్.. పోలీసుల చేతికి నిందితుడు..
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:57 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఉప ముఖ్యమంత్రి ఫొటోలు మార్ఫింగ్ చేసిన ఓ యువకుడు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు.

పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా(Social Media) వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తన, మన అనే బేధాలు లేకుండా రాజకీయ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి జైలుకు సైతం తరలించారు. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిని భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కల్యాణ్ను కించపరిచేలా ఆయన మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జనసేన అధినేత, తమ అభిమాన నేతైన పవన్ కల్యాణ్ను అవమానించారంటూ హర్షవర్ధన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 19న భీమవరం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫొటోలు మార్ఫింగ్ చేసి తమ మనోభావాలు దెబ్బతీశారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం సెతేరి గ్రామానికి చెందిన చింతలపూడి పవన్ కుమార్ అలియాస్ ప్రేమ్ను నిందితుడిగా గుర్తించినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే మార్ఫింగ్ చేసిన ఫొటోలను నిందితుడు తన ట్విటర్(ఎక్స్) ఖాతాలో పోస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నోటీసులు అందించి అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రముఖులు, మహిళలు, ఇతర వ్యక్తులను కించపరిచేలా పోస్టులు పెడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ హెచ్చరించారు.
కాగా, గతంలోనూ డిప్యూటీ సీఎం ఫొటోలను కొంతమంది మార్ఫింగ్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళాలో పవన్ పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా కొంతమంది వాటిని అవమానకర రీతిలో మార్ఫింగ్ చేశారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పైనా ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ను నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: తాజ్ కృష్ణ హోటల్ వద్ద యువతి హల్చల్.. భవనం పైకి ఎక్కి బాబోయ్..
Minister Ram Prasad Reddy: గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్..