Vamsi Health Update: వంశీ ఆరోగ్యం ఓకే
ABN , Publish Date - May 27 , 2025 | 05:37 AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగా ఉందని గుంటూరు జీజీహెచ్ వైద్యులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జైలుకు తరలించారు.

గుంటూరు జీజీహెచ్ వైద్యుల వెల్లడి
న్యూరాలజీ, పల్మనాలజీ టెస్టులు పూర్తి
ఆరోగ్యం నిలకడగానే ఉందని నిర్ధారణ
ఆస్పత్రిలో అందుబాటులో లేని స్లీప్ టెస్ట్
వేరేచోట చేయించాలని సూపరింటెండెంట్ సూచన
పరీక్షల అనంతరం విజయవాడ జైలుకు
గుంటూరు, మే 26(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. పోలీసు కస్టడీ సందర్భంగా ఆయన ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. కంకిపాడు పీహెచ్సీలో, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి.. అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పారు. అయితే నిద్రలేమి సమస్యతో పాటు నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వంశీ చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనకు స్లీప్ టెస్టు చేయాలని వైద్యులు పేర్కొన్నారు. అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ టెస్ట్ లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్కు తీసుకెళ్లడానికి పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇక్కడ గతంలో అందుబాటులో ఉండే స్లీప్ టెస్ట్.. ప్రస్తుతం లేదు. ఇది తెలుసుకోకుండానే ఉదయం పోలీసులు వంశీని ఇక్కడకు తీసుకొచ్చారు. శ్వాసలో ఇబ్బందులు ఉన్నాయని వంశీ చెప్పిన నేపథ్యంలో గుంటూరు వైద్యులు నరాలు, శ్వాసకోస సంబంధ పరీక్షలు చేశారు. వంశీకి సమస్యలు లేవని న్యూరాలజీ, పల్మనాలజీ వైద్యులు నిర్ధారించారు. పరీక్షలు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటల సమయంలో పటిష్ఠ బందోబస్తు మధ్య ఆయనను విజయవాడ జైలుకు తరలించారు.
నిలకడగానే వంశీ ఆరోగ్యం: జీజీహెచ్ సూపరింటెండెంట్
వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. విజయవాడ వైద్యులు స్లీప్ టెస్ట్ రాశారని, ఆ టెస్టు గుంటూరు జీజీహెచ్లో ప్రస్తుతం అందుబాటులో లేదని చెప్పారు. స్లీప్ టెస్ట్ కోసం అందుబాటులో ఉన్న ఏ ఆస్పత్రికైనా వెళ్లవచ్చని సూచించారు.
ఆస్పత్రి వద్ద పకడ్బందీగా బందోబస్తు
పటిష్ఠ బందోబస్తు మధ్య విజయవాడ నుంచి పోలీసులు వంశీని గుంటూరుకు తీసుకొచ్చారు. ఆస్పత్రి వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు పోలీస్ స్టేషన్లోనే రాచమర్యాదలు, ఎస్కార్ట్ పోలీసులతో విందు భోజనం, అదేవిధంగా వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై దాడి, పోలీసులపై దౌర్జన్యం చేయడం వంటి ఘటనల్లో 20 మందికిపైగా పోలీసులు సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాలకు తిరిగి అవకాశం కల్పించకూడదనే ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంశీకి వైద్య పరీక్షల సమయంలో జీజీహెచ్ మెయిన్ గేట్ను మూసివేశారు. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమర్శలు వ్యక్తం కావడంతో గంట తర్వాత గేట్లు తెరిచారు. వంశీని కలవడానికి ఆయన భార్య పంకజశ్రీ గుంటూరు ఆస్పత్రి వద్దకు వచ్చారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఆయనతో మాట్లాడేందుకు వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. వంశీ వస్తున్నారని తెలుసుకుని గుంటూరు తూర్పు వైసీపీ ఇన్చార్జి నూరి ఫాతిమా, వైసీపీ కార్పొరేటర్లు ఆస్పత్రి వద్దకు వచ్చారు. వారెవరినీ పోలీసులు లోనికి అనుమతించలేదు.
వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
నూజివీడు, మే 26 (ఆంధ్రజ్యోతి): గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను ఏలూరు జిల్లా నూజివీడు సెకండ్ అడిషనల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ సోమవారం కొట్టివేశారు. బాపులపాడు మండలం పరిధిలో నకిలీ నివాస స్థలాల పట్టాల జారీ వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కోర్టులో సోమవారం వాదనలు జరగగా పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.