Vallabhaneni Vamsi: మధ్యంతర బెయిలివ్వండి
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:52 AM
ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఒత్తిడితో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని, తన ఆరోగ్యం క్షీణిస్తోందని వంశీ పిటిషన్లో పేర్కొన్నారు.

హైకోర్టులో వంశీ అనుబంధ పిటిషన్
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత వైద్యులు సూచించిన ఆస్పత్రిలో వైద్యం పొందడానికి వీలుగా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, తనకు విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, జూన్ 5న వైద్యపరీక్షల నివేదిక అందజేయాలని ఆదేశించిందని తెలిపారు. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఆస్పత్రి వర్గాలపై పోలీసులు ఒత్తిడి తెచ్చి తనను డిశ్చార్జ్ చేసేలా చేశారని ఆరోపించారు. 110 రోజులుగా జైల్లో ఉన్న తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వంశీ కోరారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం పరిధిలో నకిలీ ఇళ్లపట్టాల జారీకి సంబంధించి హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు నూజివీడు కోర్టు నిరాకరించడంతో వంశీ హైకోర్టును ఆశ్రయించారు.