Mangalagiri Court: ఏం మాట్లాడేదీ తెలియదా
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:20 AM
జర్నలిస్టుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు.. ఏం మాట్లాడాలో.. ఏది మాట్లాడకూడదో తెలియదా అని ఎనలిస్టు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు అలియాస్ వీవీఆర్ కృష్ణంరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది.

వేశ్యల రాజధాని అని ఎలాగన్నారు?
కృష్ణంరాజును నిలదీసిన మంగళగిరి కోర్టు
తప్పుచేశానని అర్థమవుతోందన్న కృష్ణంరాజు
ఏ-1కు రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్.. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
గుంటూరు, జూన్ 12(ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు.. ఏం మాట్లాడాలో.. ఏది మాట్లాడకూడదో తెలియదా అని ఎనలిస్టు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు అలియాస్ వీవీఆర్ కృష్ణంరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది. రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన (ఏ-1) ఆయన.. తప్పుచేశానని అర్థమవుతోందని బదులిచ్చారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తుళ్లూరు పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసులో కృష్ణంరాజును విశాఖ వద్ద భీమిలి పోలీసులు అరెస్టుచేసి.. తుళ్లూరు పోలీసులకు అప్పగించడం.. బుధవారం రాత్రి ఆయన్ను నల్లపాడు పోలీసు స్టేషన్కు తరలించడం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కృష్ణంరాజుకు పోలీసులు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మంగళగిరిలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ సురేశ్బాబు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు కృష్ణంరాజును గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో రెండో నిందితుడైన కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఈ జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. సాక్షి యాజమాన్యం ఏ-3గా ఉన్న సంగతి తెలిసిందే.
బెయిల్ కోసం కోర్టుకు కొమ్మినేని
నిందితుడు కొమ్మినేని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు రోజులు గడువు కావాలని ప్రత్యేక న్యాయవాది వీరగంధం రాజేంద్రప్రసాద్ కోరగా.. అందుకు కోర్టు అనుమతించింది. కృష్ణంరాజు రాజధాని ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరించి మాట్లాడిన సమయంలో యాంకర్గా ఉన్న కొమ్మినేని ఖండించకపోగా.. అవును నిజమే.. తాను కూడా ఆంగ్ల పత్రికల్లో చదివానంటూ వాటి పేర్లు చెప్పారని.. అయితే ఆయన బెయిల్ పిటిషన్లో ఆయా పత్రికల క్లిప్పింగ్స్ లేవని రాజేంద్ర ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా.. ఈ కేసులో ఇద్దరు నిందితులనూ తమ కస్టడీకి కోరుతూ పోలీసులు శుక్రవారం పిటిషన్లు దాఖలు చేయనున్నారు.
‘ముందస్తు’ పిటిషన్పై విచారణ మూసివేత
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ముందస్తు బెయిల్ కోరుతూ కృష్ణంరాజు వేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆయన తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్ను పోలీసులు అరెస్టు చేశారని.. ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమైందన్నారు. ఈ వాదనలు నమోదు చేసిన న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్.. వ్యాజ్యంపై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
కోర్టు వద్ద మహిళల నిరసన
పోలీసు వాహనాన్ని అడ్డుకునే యత్నం
కృష్ణంరాజును మంగళగిరి కోర్టులో గురువారం హాజరు పరుస్తున్నారనే విషయం తెలుసుకున్న అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. రిమాండ్ విధించిన అనంతరం గుంటూరు జైలుకు తరలిస్తున్న క్రమంలో కృష్ణంరాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే కోర్టు వద్ద మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. పలువురు రైతులు కృష్ణంరాజుపైకి వాటర్ ప్యాకెట్లు విసిరే ప్రయత్నం చేశారు. రైతులు, మహిళల ఆందోళనను గమనించిన పోలీసులు పరుగున కృష్ణంరాజును వ్యానులోకి ఎక్కించారు. అదే సమయంలో వర్షం కురవడంతో పోలీసుల పని సులువైంది.
మేజిస్ట్రేట్ ప్రశ్నలవర్షం..
కృష్ణంరాజును కోర్టులో హాజరుపరిచిన సమయంలో మేజిస్ట్రేట్ సురేశ్బాబు ఆయనపై ప్రశ్నలవర్షం కురిపించారు. సాక్షి చానల్ డిబేట్లో కొమ్మినేనితో పాటు ఉన్న రెండో వ్యక్తి మీరేనా అని అడుగగా.. తానేనని కృష్ణంరాజు సమాధానం చెప్పారు. ల్యాప్టా్పలో నాటి చర్చను చూపమంటారా అని అడుగగా.. అవసరం లేదండీ.. చర్చలో పాల్గొన్నానని తెలిపారు.
మేజిస్ట్రేట్: మీరేం చేస్తుంటారు?
కృష్ణంరాజు: 30ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నాను.
మేజిస్ట్రేట్: అంతటి అనుభవం ఉన్న మీకు ఏం మాట్లాడాలో... ఏం మాట్లాడకూడదో తెలియదా? అమరావతి దేవతల రాజధాని కాదని, వేశ్యల రాజధాని అని ఎలా అన్నారు?
కృష్ణంరాజు: (సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. తలవంచుకున్నారు)
మేజిస్ట్రేట్: పోలీసులు ఇబ్బంది పెట్టారా?
కృష్ణంరాజు: బాగా చూసుకున్నారు. ముఖ్యంగా తుళ్లూరు డీఎస్పీ చాలా మర్యాదగా వ్యవహరించారు (ఆకాశానికెత్తేలా మాట్లాడుతుండగా మేజిస్ట్రేట్ వారించారు).
మేజిస్ట్రేట్: మీకు కేసు పత్రాలు అందించారా?
కృష్ణంరాజు: ఇచ్చారు.
మేజిస్ట్రేట్: మీరు చెప్పుకొనేది ఏమైనా ఉందా?
కృష్ణంరాజు: పొరపాటు చేసినట్లు అర్థమవుతోంది.