TTd Board Members: క్యూలైన్లో నినాదాలు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:18 AM
తిరుమల క్యూలైన్లో టీటీడీపై నినాదాలు చేసిన వ్యక్తిపై బోర్డు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని, సంబంధిత వీడియో తీసిన ఉద్యోగిని సస్పెండ్ చేయడం కాకుండా తొలగించాలని బోర్డు నిర్ణయించనుంది.

కేసు నమోదు చేయాలి: టీటీడీ బోర్డు సభ్యులు
తిరుమల, జూన్2(ఆంధ్రజ్యోతి): తిరుమల క్యూలైన్లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటూ టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్రెడ్డి, నరేష్ కుమార్ సోమవారం తిరుమల టూటౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. భానుప్రకాశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 30వ తేదీ రాత్రి ఓ వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారని పేర్కొన్నారు. గోశాలలో ఆవులు చనిపోతున్నాయని గతంలో కూడా వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అబద్ధపు ప్రచారాన్ని చేశారన్నారు. అలాగే ఒక ముస్లిం వ్యక్తిని నమాజు చేసుకోమని చెప్పి, వీడియో తీసి సోషల్మీడియా, మీడియాకు వైసీపీకి చెందిన వ్యక్తి లీక్ చేశాడన్నారు. తాజాగా క్యూలైన్లోనూ నినాదాలు చేశారని, దీనిపై వెంటనే కేసు నమోదు చేయాలని టీటీడీ విజిలెన్స్, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వీడియో తీసిన ఉద్యోగిని సస్పెండ్ చేయడం కాకుండా ఉద్యోగం నుంచి తొలగించాలని రానున్న బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీలో 2వేల మంది ఉద్యోగులు తమకు నిఘా నేత్రాలు ఉన్నారని కరుణాకరరెడ్డి చెప్పారని, ఈ నిఘా నేత్రాలను గుర్తించి త్వరలోనే ఇంటికి పంపేస్తామన్నారు.