SIT Investigation: తిరుపతి చేరిన లిక్కర్ లింకులు
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:53 AM
మద్యం కుంభకోణంలో ‘తిరుపతి’ లింకులు బయటపడుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రెండు రోజులు తిరుపతిలో మకాం వేసి పలువురిని ప్రశ్నించి, కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

రెండు రోజులు సిట్ అధికారుల విచారణ
చంద్రగిరి, తిరుపతిలో సమాచార సేకరణ
అరెస్టు చేయాలనుకుంటే నేనే వస్తా: చెవిరెడ్డి
అమరావతి/తిరుపతి (నేరవిభాగం, రూరల్), జూన్ 5(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ‘తిరుపతి’ లింకులు బయటపడుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రెండు రోజులు తిరుపతిలో మకాం వేసి పలువురిని ప్రశ్నించి, కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ‘మద్యం ముడుపులతో ఓట్ల కొనుగోలు’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ సంచలన కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి డ్రైవర్ ద్వారా మద్యం ముడుపులు చేరవేసినట్లు ‘సిట్’ గుర్తించినట్లు వెల్లడించింది. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లోని కొంతమంది ముఖ్య నాయకులు, అధికారుల నుంచి వివరాలు రాబట్టి... కొందరి వాంగ్మూలాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులు, ఇతరత్రా వస్తువులకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? అనే అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది.
తప్పుడు వాంగ్మూలం రికార్డు చేశారు: చెవిరెడ్డి
‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ప్రత్యక్షంగా ఎవరి పేర్లూ ప్రస్తావించనప్పటికీ... దీనిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పోలీసులు తనను లిక్కర్ కేసులో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, గతంలో తనవద్ద పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ గిరిని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. గురువారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ప్రభుత్వ విప్గా ఉన్నప్పుడు గన్మ్యాన్గా పనిచేసిన కానిస్టేబుల్ గిరిని సిట్ ఆఫీసుకు పిలిచి... ఐదురోజులు విచారణ పేరుతో నరకం చూపించారు. నేను రూ.250నుంచి రూ.500కోట్లు తరలించినట్లు సాక్ష్యం చెప్పాలని కానిస్టేబుల్ను వేధించారు. నన్ను అరెస్టు చేయాలనుకుంటే బెటాలియన్లు అక్కర్లేదు. రమ్మంటే నేనే వచ్చి లొంగిపోతా. కోర్టులో నిజానిజాలు బయటకు వస్తాయి’’ అని చెవిరెడ్డి పేర్కొన్నారు. మద్యం వల్ల తన తమ్ముడు, తండ్రిని కోల్పోయానని... మద్యానికి తాను ఎప్పటికీ దూరమేనని చెప్పారు.