Tirupati Weekend Rush: తిరుమల కిటకిట
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:42 AM
వేసవి సెలవులు, వారాంతం కారణంగా తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, టోకెన్లు కలిగిన భక్తులు కూడా గంటల తరబడి నిరీక్షిస్తున్నారు

తిరుమల, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, వివిధ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు వారాంతం కావడంతో ఉదయం నుంచి భక్తుల రాక పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయారు. వీరికి దాదాపు 18 గంటల దర్శన సమయం పడుతోంది. ఇక స్లాటెడ్ టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులకు కూడా మూడు నుంచి నాలుగు గంటల దర్శన సమయం పడుతోంది. రద్దీ పెరిగిన క్రమంలో గదులకు డిమాండ్ పెరిగింది. గదుల కోసం భక్తులు రెండుమూడు గంటల క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా రద్దీగా మారాయి. భక్తుల రాక పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కూడా రద్దీ కొనసాగే అవకాశముంది.