Share News

Operation Sindoor Celebration: ఘనంగా తిరంగార్యాలీలు

ABN , Publish Date - May 18 , 2025 | 04:52 AM

ఆపరేషన్‌ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని మూడు జిల్లాల్లో ఘనంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. మంత్రి, ఎంపీలు, అధికారులు, విద్యార్థులు పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు.

Operation Sindoor Celebration: ఘనంగా తిరంగార్యాలీలు

  • మూడు జిల్లాలో నిర్వహణ

  • పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

రాజమహేంద్రవరం సిటీ/అనంతపురం/టెక్కలి, మే 17(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో శనివారం మూడు జిల్లాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పుష్కరాల రేవు నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో మంత్రి కందుల దుర్గేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకట్రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, అధికారులు పాల్గొన్నారు. చినుకులు పడుతున్నా లెక్కచేయకుండా నాయకులు జాతీయ జెండాలతో ‘మేరా భారత్‌ మహాన్‌.. జయహో భారత్‌..’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతపురం నగరంలో ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానం నుంచి క్లాక్‌టవర్‌ మీదుగా సప్తగిరి సర్కిల్‌ వరకూ నిర్వహించిన ర్యాలీలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, ఎంఎస్‌ రాజు, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ జగదీశ్‌ జాతీయ జెండాలు చేతపట్టుకుని ముందు వరుసలో నిలిచారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు వారిని అనుసరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మన సైన్యం పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పిందని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల విజయమని, మన సైనికుల ధైర్య సాహసాలకు ప్రతిఒక్కరూ సెల్యూట్‌ చెప్పాలని కోరారు.

Updated Date - May 18 , 2025 | 04:52 AM