Peruru Clash Case: ముంబై చెక్కేసిన తోపుదుర్తి
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:20 AM
శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ‘చలో పేరూరు’ గొడవకు సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం.

‘చలో పేరూరు’ గొడవలో కేసు నమోదు
అరెస్టు భయంతో పరార్.. వెంబడించిన పోలీసులు
తప్పించుకుని శంషాబాద్ వెళ్లి.. విమానమెక్కిన మాజీ ఎమ్మెల్యే
ధర్మవరం/చెన్నేకొత్తపల్లి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ‘చలో పేరూరు’ గొడవకు సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం. రామగిరి మండలంలో అత్యాచార బాధిత బాలికను పరామర్శించేందుకు ఆయన గురువారం ‘చలో పేరూరు’కు పిలుపిచ్చారు. పోలీసులు అనుమతి నిరాకరించినా.. వైసీపీ శ్రేణులు ధిక్కరించి బలప్రదర్శన చేశాయి. టీడీపీ విజయోత్సవ ర్యాలీపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. తోపుదుర్తితోపాటు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మను కనగానపల్లి మండలం మద్దెలచెరువు వద్ద అడ్డుకుని పోలీసులు వెనక్కి పంపించారు. పేరూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినందుకు తోపుదుర్తి, మరికొందరు వైసీపీ నేతలపై రామగిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం అనంతపురంలోని తోపుదుర్తి ఇంటికి వెళ్లి 41ఏ నోటీసు ఇచ్చారు. తమకు తెలియకుండా ఎక్కడకూ వెళ్లరాదని, రామగిరి సర్కిల్ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. అయితే విచారణ పేరుతో అరెస్టు చేస్తారన్న అనుమానంతో తోపుదుర్తి హైదరాబాద్ బయల్దేరారు. విషయం తెలుసుకున్న చెన్నేకొత్తపల్లి, బత్తలపల్లి ఎస్ఐలు సత్యనారాయణ, సోమశేఖర్ తమ సిబ్బందితో ఆయన వాహనాన్ని వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆయన.. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని.. విమానంలో ముంబై వెళ్లినట్లు తెలిసింది.