Anti Terrorism Squad: ఏ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర చేశారు
ABN , Publish Date - May 26 , 2025 | 04:28 AM
ఉగ్రవాద అనుమానితులు సిరాజ్, సమీర్లపై ఎన్ఐఏ, ఏటీఎస్, స్థానిక పోలీసులు మూడోరోజు విచారణ కొనసాగించారు. వారు ఏ రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారనే అంశంపై విచారణ జరిగింది.

సిరాజ్, సమీర్లపై కొనసాగిన విచారణ
విజయనగరం, మే 25(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్ ఉర్ రెహ్మన్, సయ్యద్ సమీర్లపై మూడో రోజు ఆదివారం విచారణ కొనసాగింది. ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్), స్థానిక పోలీసులు వారిని ప్రశ్నించారు. ఉగ్రవాద విదేశీ లింకులు, ఏయే రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర చేశారు? ఆర్థిక లావాదేవీలు, సహకారం అందించిన వారి వివరాల గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. సోషల్ మీడియా ఖాతాలు, కాల్డేటా, ఇంటర్నెట్ కాల్స్పై ఆరా తీశారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన నిధులు ఏయే బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయనే విషయాలపై బ్యాంకు అధికారులతో కూడా చర్చించినట్లు తెలిసింది. అయితే విచారణలో సిరాజ్, సమీర్లు చాలా వరకు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. అనేక ప్రశ్నలకు ‘మాకు సంబంధం లేదు’ అనే సమాధానమే చెబుతున్నట్లు తెలిసింది. ఆదివారం 10 గంటల పాటు ఇద్దరిని విచారించారు.