Share News

Education Department : ఇక ఏటా టీచర్ల బదిలీలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 03:56 AM

ప్రస్తుత విధానంలో టీచర్ల బదిలీలపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా చేయాలా.. లేదా? చేస్తే ఏ సమయంలో చేయాలనేదానిపై గందరగోళం నెలకొంది.

Education Department : ఇక ఏటా టీచర్ల బదిలీలు

  • త్వరలోనే చట్టం.. వారంలో ముసాయిదా బిల్లు

  • బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు

  • ప్రతి వేసవిలోనూ బదిలీల ప్రక్రియ

  • తప్పనిసరి బదిలీల్లో టీచర్లకు 8 ఏళ్లు, హెచ్‌ఎంలకు 5 ఏళ్ల సర్వీసు

  • ముసాయిదాపై మళ్లీ అభిప్రాయ సేకరణ

  • ఆ తర్వాత బిల్లుకు తుది రూపం

ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం బదిలీలు చేపట్టాలని నిశ్చయించింది. ఇందుకోసం చట్టమే తీసుకురానుంది.

అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విధానంలో టీచర్ల బదిలీలపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా చేయాలా.. లేదా? చేస్తే ఏ సమయంలో చేయాలనేదానిపై గందరగోళం నెలకొంది. ప్రతిసారీ టీచర్ల వినతులు, ప్రభుత్వ అభీష్టం ఆధారంగా రెండు మూడేళ్లకోసారి బదిలీలు చేస్తూ వస్తున్నారు. అది కూడా కొన్నిసార్లు విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలకు తెరతీసి గందరగోళం చేస్తున్నారు. ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఏటా కచ్చితంగా వేసవిలో మాత్రమే బదిలీలు జరిగేలా చట్టం రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన పాఠశాల విద్యాశాఖ.. నిబంధనలపై కొంత స్పష్టతకు వచ్చింది. వారం రోజుల్లో ముసాయిదా బిల్లును తయారుచేసి దానిపై మళ్లీ అభిప్రాయాలు తీసుకుని తుది రూపం ఇస్తుంది. సదరు బిల్లును వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముసాయిదా బిల్లు ప్రకారం.. తప్పనిసరి బదిలీలకు టీచర్లకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకోనుంది. ఏటా మే 31వ తేదీని కటాఫ్‌ తేదీగా పరిగణించి సర్వీసును లెక్కించే విధంగా బిల్లును రూపొందిస్తోంది.


టీచర్లు విద్యా సంవత్సరాలను బదిలీలకు ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం సాధారణ సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. జీరో సర్వీసు బదిలీలు ఉండాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దానిపై ఇంకా స్పష్టత రావలసి ఉంది. సార్వత్రిక ఎన్నికలు, జనాభా గణన ఉంటే తప్ప ఇకపై ఏటా కచ్చితంగా బదిలీలు జరుగుతాయి. ప్రస్తుత విధానంలో ప్రభుత్వం టీచర్ల బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేసిన వెంటనే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ షెడ్యూల్‌ పదే పదే మారిపోవడం జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇకపై న్యాయ వివాదాలకు తావు ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

విద్యా సంవత్సరాన్నే తీసుకోవాలి:నోబుల్‌ టీచర్లు

రాబోయే టీచర్ల బదిలీల్లో విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని.. ఆ తర్వాత బదిలీల్లో కటాఫ్‌ తేదీని తీసుకోవాలని నోబుల్‌ టీచర్ల సంఘం కోరింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకట్రావు, బి.హైమారావు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజును కలిసి వినతిపత్రం అందజేశారు.

మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి జయంతి

సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం రాష్ట్ర మహిళా దినోత్సవంగా ప్రకటించాలని నవ్యాంధ్ర టీచర్ల సంఘం అధ్యక్షుడు కరణం హరికృష్ణ కోరారు. తెలంగాణ తరహాలో వేడుకలు నిర్వహించాలన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 03:57 AM