Tiruvuru: రసవత్తరంగా తిరువూరు ఛైర్మన్ ఎన్నిక
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:23 PM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. చివరికి టిడిపి పీఠం కైవసం చేసుకుంది. టిడిపి అభ్యర్థి కోలికపోగు నిర్మల విజయ దుందుభి మ్రోగించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని టిడిపి కైవసం చేసుకుంది. టిడిపి అభ్యర్థి కోలికపోగు నిర్మల 11 ఓట్లతో విజయం సాధించారు. పది మంది టీడీపీ కౌన్సిలర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓటు హక్కును వినియోగించుకోవడంతో నిర్మల గెలిచారు. వైసీపీ అభ్యర్థి మోతుకు ప్రసాద్కు 9 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఒకటవ వార్డు కౌన్సిలర్ కె.నిర్మలకు ఎమ్మెల్యే ఓటు పాటు, 10 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు.
తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్గా ఎన్నికైన నిర్మలకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ చిన్ని.. వైసీపీ నాయకులు, కౌన్సిలర్లను వారి కుటుంబాలకు దూరం చేసి క్యాంపు రాజకీయాలు నడిపారన్నారు. టీడీపీ పార్టీగా తామెవ్వరం క్యాంపు రాజకీయాలు నడపలేదని.. టిడిపి కౌన్సిలర్లు స్వేచ్ఛగా తిరువూరులోనే వారి నివాసంలో కుటుంబ సభ్యులతోనే గడిపారని చిన్ని తెలిపారు.
విజయవాడకు చెందిన వైసిపి గుండాలు తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని.. తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటుతో వెనుదిరిగారని చిన్ని అన్నారు. నాలుగేళ్లలో నగర పంచాయతీలో అభివృద్ధి జరగకుండా వైసిపి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని ఎంపీ విమర్శించారు. ఈరోజు నుంచే తిరువూరు నగర పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికాయుతంగా, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి చర్యలు మొదలు పెడతామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
తాగునీరు, నగరంలో పారిశుద్ధ్యం, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించే విధంగా ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తిరువూరు నగర పంచాయతీని మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు సహకరించిన ఎన్డీఏ కూటమి నేతలకు, మీడియాకు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్.