AP Welfare Scheme: అమ్మ కళ్లలో ఆనందం
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:37 AM
ఒకే ఇంట్లో ఆరుగురు పిల్లలకు.. ఐదుగురు పిల్లలున్న మరికొందరికి ఒకేసారి రూ.65 వేలు.. నలుగురున్న ఇంకొందరికి రూ.52 వేలు.. ముగ్గురు పిల్లలు ఉన్నవారికి రూ.39 వేలు.. ఇలా ఇంట్లో ఒకరు, ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలు...

ఖాతాల్లో ‘తల్లికి వందనం’ జమ.. కర్నూలు జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురికి
పలు కుటుంబాలకు ఒకేసారి 65 వేలు
మరికొందరికి 52 వేలు, 39 వేలు కూడా
హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్)
ఒకే ఇంట్లో ఆరుగురు పిల్లలకు.. ఐదుగురు పిల్లలున్న మరికొందరికి ఒకేసారి రూ.65 వేలు.. నలుగురున్న ఇంకొందరికి రూ.52 వేలు.. ముగ్గురు పిల్లలు ఉన్నవారికి రూ.39 వేలు.. ఇలా ఇంట్లో ఒకరు, ఇద్దరికి మించి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ నగదు పడుతుండటంతో అమ్మ కళ్లలో అంతులేని ఆనందం కనిపిస్తోంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వేలాదిమంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం నగదు జమ కావడం, మెసేజ్లు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ పిల్లల చదువుకు సాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. పలు చోట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు..
ఒకే కుటుంబంలో ఆరుగురికి..
కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రానికి చెందిన పింజరి చాంద్బాషా, షకీనాబీ దంపతులకు ఆరుగురు కుమార్తెలు. వారిది పేద కుటుంబం. ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ పిల్ల్లలను పోషిస్తున్నారు. చిన్నారులు రేష్మ, సైనాజ్, సైరా, అమీష, అసీఫా, సుభాన్బీ పాఠశాల విద్య చదువుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ కుటుంబంలో ఒకరికి మాత్రమే రూ.13 వేలు అమ్మఒడి కింద వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబంలో ఆరుగురు పిల్లలకూ తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. శుక్రవారం ముగ్గురు పిల్లలకు రూ.13 వేలు చొప్పున తల్లి షకీనాబీ ఖాతాలో రూ.39 వేలు జమైంది. మరో ముగ్గురు పిల్లలకు మరో రూ.39 వేలు జమ కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆరుగురు పిల్లలకూ తల్లికి వందనం పథకం వర్తింపచేయడంతో ఆ కుటుంబం ఆనందం అంతా ఇంతా కాదు. చుట్టుపక్కల ఇళ్ల వారితో కలసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
బాబుకు కృతజ్ఞతలు
నాకు నలుగురు పిల్లలు. కూలి నాలీ చేసి చదివిస్తున్నా. కౌలు రైతు కష్టం తెలియనిది కాదు. మాకు ఎంతో అక్కరకు వచ్చేలా తల్లికి వందనం పథకం అమలు చేశారు. ఒకేసారి నలుగురు పిల్లలకు డబ్బులు రావడం.. మాకు చంద్రబాబు చేసిన ఊహించని సహాయం. ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞులమే.
- తోట నాగమల్లేశ్వరరావు, ఈమని, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా
ఒకే కుటుంబానికి 65 వేలు జమ
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామానికి చెందిన రత్నమ్మ, రామాంజినేయులు దంపతులకు ఆరుగురు సంతానం. సుస్మిత, అక్షిత 9వ తరగతి, దివ్య 6వ తరగతి, సాయి, మణికంఠ 3వ తరగతి, శాంతి 7వ తరగతి చదువుతున్నారు. శాంతికి మినహా మిగిలిన ఐదుగురినీ తల్లికి వందనం పథకానికి ఎంపిక చేశారు. తల్లి ఖాతాలో రూ.65 వేలు జమైంది.
కలలో కూడా ఉహించలేదు
మాకు నలుగురు ఆడపిల్లలు. రెక్కాడితేగాని పూట గడవని పేదరికం. ఆడపిల్లలను బాగా చదివించాలని బడికి పంపుతున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే రూ.13 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముగ్గురు పిల్లలకు రూ.39 వేలు తల్లి ఖాతాలో జమ చేసింది. నాలుగో కుమార్తెను ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరుస్తున్నాం. ఈ అమ్మాయికి కూడా ఇస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రుణం తీర్చుకోలేనిది. మాలాంటి పేదలకు రూ.39 వేలు అంటే కలలో కూడా ఉహించలేని మొత్తం. చంద్రన్న ఇచ్చిన స్ఫూర్తితో మా నలుగురు పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. మా పెద్దన్న చంద్రన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
- హరిజన కల్లుబావి పద్మ, రవి దంపతులు, కోసిగి, కర్నూలు జిల్లా
ఎంతో ఆనందంగా ఉంది
ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. రోజంతా ఆటో నడిపినా డబ్బులు కుటుంబం పోషణకు సరిపోవటం అంతంతమాత్రమే. పిల్లలకు మంచి బట్టలు కూడా కొనివ్వలేని పరిస్థితి. తల్లికి వందనం డబ్బులు నలుగురు పిల్లలకు రూ.52 వేలు రావటం ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలకు అవసరమైనవి కొనిస్తాము.
-సల్ల సుబ్రహ్మణ్యం, దుర్గ దంపతులు, ఎన్టీఆర్ నగర్, అద్దంకి
చంద్రబాబు దేవుడు
నా ఐదుగురు పిల్లలకు 65 వేలు ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు దేవుడు కన్నా ఎక్కువ. భర్త చనిపోవడంతో నలుగురు ఆడపిల్లలను, కుమారుడిని పోషించడమే కష్టంగా ఉంది. చదివించలేనని అనుకున్నాను. మా పాలిట దేవుడిలా చంద్రబాబు అవతరించారు. తల్లికి వందనం పథకం కింద ఖాతాలో రూ.65 వేలు వేశారు. ఆయన చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేం.
- మేరీ, ఈపూరు ఎస్సీ కాలనీ, పల్నాడు జిల్లా
జీవితంలో మరిచిపోలేను
నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఒంటరి మహిళ దార్ల జ్యోతికి నలుగురు సంతానం. సలోమి 7వ తరగతి, అనిత 5వ తరగతి, గురువమ్మ 3వ తరగతి, కోటేశ్ 2వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పఽథకం కింద వీరందరికి కలిపి ఒకేసారి రూ.52 వేలు జ్యోతి బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. పాచి పని చేసుకుంటూ బిడ్డలను చదివించుకుంటున్న తనకు రూ.52 వేలు సాయం చేయడం తన జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒకే ఇంట్లో ఐదుగురికి..
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట 31వ వార్డు భాస్కర్నగర్కు చెందిన షేక్ లాల్షా, గులాబి దంపతులకు ఐదుగురు సంతానం. పిల్లలు షేక్ అజీనా (8వ తరగతి), షేక్ ఆయీషా (6వ తరగతి), షేక్ షబీనా (5వ తరగతి), షేక్ అరీఫా (4వ తరగతి), షేక్ ఆజీనా (3వ తరగతి)లకు రూ.13 వేలు చొప్పున తల్లి ఖాతాలో రూ.65 వేలు జమైంది. పిల్లల చదువుల కోసం ఇంత పెద్ద మొత్తం సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి షేక్ గులాబి, లాల్షాలు కృతజ్ఞతలు తెలిపారు.