Seed Supply Delay: సీజనొస్తున్నా.. సరఫరా ఏదీ
ABN , Publish Date - May 18 , 2025 | 03:48 AM
రాయితీ విత్తనాల పంపిణీలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్లో నిధులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ విడుదల చేయక పోవడం, పాత బకాయిల వల్ల సరఫరాదారుల అసహకారం తలెత్తింది.

రాయితీ విత్తన పంపిణీలో తాత్సారం
బడ్జెట్లో 240 కోట్లు కేటాయింపు
40శాతం కోత పెట్టాలంటున్న ఆర్థిక శాఖ?
ఇంకా నిధులు విడుదల చేయని వైనం
విత్తన సరఫరాదారులకు గత ప్రభుత్వం 800 కోట్లు బకాయి
మళ్లీ అప్పు ఇచ్చేందుకు విముఖత
ఇండెంట్ పెట్టని వ్యవసాయ శాఖ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఖరీఫ్ సాగు ప్రారంభం కానుంది. కానీ రైతులకు రాయితీ విత్తనాల సరఫరాలో ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయి. ఏటా ఈపాటికే ఏపీ సీడ్స్ నుంచి వరి, మినుము, పెసర, కంది, వేరుశనగ, ఉలవ, సజ్జ, రాగి విత్తనాలు రైతులకు పంపిణీ కోసం మండల కేంద్రాలకు చేరేవి. ఈ ఏడాది ఇంత వరకు వ్యవసాయ శాఖ ఏపీ సీడ్స్కు ఇండెంట్ కూడా పెట్టలేదు. విత్తన రాయితీకి సంబంధించిన నిధులు ఆర్థిక శాఖ నుంచి ఇంకా విడుదల కాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2024 ఖరీఫ్లో రూ.200 కోట్ల రాయితీతో వరి, అపరాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు కలిపి 6.32 లక్షల క్వింటాళ్లు రైతులకు సరఫరా చేశారు. 2024-25 రబీలో విత్తన రాయితీకి ప్రభుత్వం రూ.130 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ల విత్తన రాయితీకి బడ్జెట్లో రూ.240 కోట్లు కేటాయించారు. ఈ మేరకు విత్తన పంపిణీకి వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. కానీ ఆర్థిక శాఖ ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. పైగా ఖజానాపై అనేక రకాలుగా భారం పడుతుండటంతో రాయితీ విత్తన సరఫరాను 40 శాతానికి కుదించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుత ఖరీ్ఫలో రాయితీ విత్తన పంపిణీకి రూ.150 కోట్లకు పైగా అవసరం ఉండగా, నిధుల విడుదలపై ఆర్థిక శాఖ నుంచి స్పందన లేదు. కనీసం మొదటి త్రైమాసికానికి ఇవ్వాల్సిన నిధులు కూడా రాక.. వ్యవసాయ శాఖ కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బకాయి, వడ్డీల భారం
గత ప్రభుత్వం ఐదేళ్లలో విత్తన సరఫరాదారులకు రూ.800 కోట్లు బకాయిలు పెట్టింది. ఈ బకాయికి నెలకు రూ.8 కోట్లు దాకా వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. బకాయి పేరుకుపోవడంతో సరఫరాదారులు మళ్లీ అప్పు ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు పాత బకాయిలకు వడ్డీలకు నిధులు సర్దుబాటు చేయలేక వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరత సాకుతో ఆర్థిక శాఖ ఈ ఏడాది ఇంత వరకు విత్తన రాయితీకి నిధులు విడుదల చేయకపోవడం.. కొత్త అప్పు పుట్టకపోవడంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తలలు బాదుకుంటున్నారు. మరోవైపు పంటల సాగు సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు రాయితీ విత్తనాల కోసం కొన్ని రోజులుగా స్థానిక వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ రైతులు వేరుశనగ, రాగి, సజ్జ వంటి రాయితీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో విత్తనాలను రైతులకు అందించలేకపోతే అనేక సమస్యలు వస్తాయని క్షేత్రస్థాయి సిబ్బంది కూడా భావిస్తున్నారు. ఏటా విత్తనాల ధరలు పెరిగిపోతుండటంతో రాయితీపై విత్తనాలు అందితేనే పంట వేసే పరిస్థితి ఉంటుందని వెనుకబడిన ప్రాంతాల సన్న, చిన్నకారు రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాయితీ విత్తన పంపిణీపై ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు.
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
భూసారం పెంపుదలకు ఉపయోగపడే, పచ్చి రొట్ట ఎరువులుగా వాడే జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను వ్యవసాయ శాఖ డీ కృషి యాప్ ద్వారా రైతులకు పంపిణీ చేస్తోంది. ఒక్కో రైతుకు ఐదెకరాలకు సరిపడా విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తోంది. తొలిసారిగా 10 కిలోల పచ్చి రొట్ట విత్తనాల మిశ్రమ సంచులను అందిస్తోంది. ఒక్కో ప్యాకెట్ ధర రూ.1,296 కాగా, రాయితీపై రూ.648కే ఇస్తోంది. కాగా ఈ ఏడాది రాష్ట్రానికి 1,736 క్వింటాళ్ల బ్రీడర్ విత్తనాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.