Police Investigation: ఇతర రాష్ట్రాల్లోనూ పేలుళ్లకు కుట్ర
ABN , Publish Date - May 25 , 2025 | 04:50 AM
సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్పై ఉగ్రవాద పంటలు వేసే కుట్రలపై విచారణ కొనసాగుతోంది. విజయనగరం మరియు ఇతర రాష్ట్రాల్లో పేలుళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సంబంధిత సమాచారంపై దర్యాప్తు జోరుగా ఉంది.

సిరాజ్, సమీర్లపై రెండో రోజు విచారణ
విజయనగరం/క్రైం, మే 24(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద సానుభూతిపరులు సిరాజ్ ఉర్ రెహ్మాన్, సయ్యద్ సమీర్ల విచారణ రెండో రోజు శనివారం కొనసాగింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పలు అభియోగాలపై ఎన్ఐఏ,ఏటీఎస్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తును వేగవంతం చేశారు. మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ఏటీఎస్ అధికారులూ విజయనగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలకు చేరుకున్నారు. సిరాజ్, సమీర్ల ద్వారా విజయనగరం, పలు ఇతర రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు, ఐసిస్ లేదా ఇతర ఉగ్ర సంస్థలు వీరిని ప్రేరేపించినట్లు విచారణలో నిర్ధారణకు వచ్చారని సమాచారం. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సిరాజ్ కుటుంబం, అతని స్నేహితుల గురించి ఆరా తీశారు. సిరాజ్ ల్యాప్టాప్లో ఉన్న వివిధ అంశాలపైనా కూపీ లాగారు.
సిరాజ్ గత నవంబరు 22న ముంబైకి వెళ్లినప్పుడు 10మందితో కలిసి హక్ ఇండియాలో లైవ్ సెషన్కు హాజరైనట్లు విచారణలో తెలిసింది. అక్కడ ఎవరెవరిని కలిశాడు? అక్కడి నుంచి ప్లాన్, పేలుడు సామగ్రి తీసుకువచ్చాడా? అనే దానిపైనా అధికారులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా ఈ ఏడాది జనవరి 26 ఢిల్లీకి ఏ పని మీద వెళ్లాడు? అక్కడ ఎవరిని కలిశాడు? అని కూడా ప్రశ్నించారని తెలిసింది.
బిహార్కు చెందిన అబూతాలెం అలియాస్ అబూముసబ్ సూచనలతో సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ ద్వారా జిహాదీ కార్యక్రమాలను తెలుసుకునేవారు. ఇందుకు సంబంధించిన పోస్టులు పెడుతూ ఇతరుల ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుని అటువైపు ఆకర్షితులైనట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
గోషామహల్ ఎమ్మెల్యేపై ద్వేషం ఉండేదని, అతను పెట్టిన వీడియోలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లు సిరాజ్ తెలిపినట్లు సమాచారం. ఈ పోస్టులను చూసిన విశాఖలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి తనను మెచ్చుకున్నట్లు విచారణలో చెప్పినట్లు తెలిసింది. సిరాజ్, సమీర్ ఆరోగ్య పరిస్థితిపై అధికారులు శ్రద్ధ తీసుకుంటున్నారు. వైద్యులు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారికి ఆహారం అందిస్తున్నారు.