Share News

Nara Lokesh: ప్రతిభకు ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:49 AM

ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం’’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

Nara Lokesh: ప్రతిభకు ప్రోత్సాహం

  • ప్రైవేటు కన్నా మిన్నగా ప్రభుత్వ విద్యా సంస్థలు

  • వచ్చే నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తాం

  • 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నాం

  • షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి లోకేశ్‌

పార్వతీపురం/విజయనగరం, జూన్‌9(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం. సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం’’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పార్వతీపురంలో సోమవారం నిర్వహించిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు-2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 95 మందికి, ఇంటర్‌ ఫలితాల్లో మెరిసిన 26 మందికి అవార్డులు అందించారు. టెన్త్‌ ఫలితాల్లో మన్యం జిల్లా వరసగా మూడేళ్లు ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘మెరుగైన ఫలితాలు సాధనకు వంద రోజుల యాక్షన్‌ప్లాన్‌ అమలు చేస్తున్నాం. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ఇది సంస్కరణల్లో తొలి అడుగు మాత్రమే. మీ ప్రతిభను గుర్తించే బాధ్యత నాది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తిరిగి మీ పాఠశాలలకు సేవ చేయాలి. మీ జూనియర్లలో స్ఫూర్తినింపాలి. పేదరికం నుంచి బయటపడటానికి చదువే ఏకైక మార్గం. కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్నవారే విజేతలుగా నిలుస్తారు. కళాశాలలకు వెళ్లాక పక్కదారి పడితే జీవితాలు నాశనమవుతాయి. డ్రగ్స్‌పై మన ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. తప్పు చేస్తే మీతో పాటు మీ తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారు. మంచి మెంటార్స్‌ ద్వారా విద్యార్థులు స్ఫూర్తి పొంది నిరంతరం నేర్చుకోవాలి. విద్యార్థులు జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటే మంచి ఫలితాలొస్తాయి. అందుకు నేనే ఉదాహరణ.


ఎన్నికల్లో ఎప్పుడూ టీడీపీ గెలవని మంగళగిరిని ఎంచుకున్నా. 2019లో ఓడిపోయా. అయినా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాను. మీరు డ్రీమ్‌ వాల్‌, గ్రాటిట్యూడ్‌ వాల్‌పై రాసినవి చూశాను. లిటరసీ రేటులో ఏపీ దేశంలో అత్యంత దిగువన ఉంది. రాబోయే నాలుగేళ్లలో నూరుశాతం అక్షరాస్యత లక్ష్యంగా మిషన్‌ అక్షర ఆంధ్రాను ప్రకటించామని లోకేశ్‌ చెప్పారు. విద్యార్థులతో కలిసి వందేమాతరం అంటూ నినదించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నిత్యం రాష్ట్రం కోసం పరితపించే సీఎం చంద్రబాబు, మాజీ ప్రధాని వాజ్‌పాయ్‌ నుంచి స్ఫూర్తిపొందానన్నారు.

విద్యా రంగానికి పెద్ద పీట: అనిత

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో ఆమె షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులను విద్యార్థులకు బహూకరించారు. ఒక్కో విద్యార్థికి రూ.20 వేల నగదు, మెడల్‌, ప్రశంసా పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను దశలవారీగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి జరుగుతోందన్నారు. విద్యార్థినులకు తమ ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలపైనా దృష్టి పెట్టాలన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 04:53 AM