Pemasani Chandrasekhar: భూ వివాద్ నుంచి భూ విశ్వాస్ వైపు సాగాలి
ABN , Publish Date - May 16 , 2025 | 03:03 AM
భూమికి స్పష్టమైన హక్కుల కోసం రికార్డుల డిజిటలైజేషన్ అత్యవసరం అని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. రాష్ట్రాల రాజకీయం వల్ల ఇది ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించారు.

భూమికి స్పష్టమైన టైటిల్ తప్పనిసరి కావాలి
రాజకీయ సంకల్ప లోపంతో డిజిటలైజేషన్కు గ్రహణం
జాతీయ స్థాయి వర్క్షా్పలో కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరు, మే 15 (ఆంధ్రజ్యోతి): భారత్లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ జరగకపోవడానికి రాజకీయ సంకల్ప శక్తి లోపమే ప్రధాన కారణమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మన వద్ద మేథావులకు, టెక్నాలజీకి కొదవ లేనప్పటికీ.. భూ రికార్డుల డిజిటలైజేషన్లో వెనకబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. మన ప్రయాణం భూ వివాద్ నుంచి భూ విశ్వాస్ వైపు సాగాలని, భూమికి స్పష్టమైన టైటిల్ తప్పనిసరి కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుంటూరులో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ) కింద సర్వే/రీసర్వేపై జాతీయ స్థాయి వర్క్షాప్ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, డీవోఎల్ఆర్ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యార్థి, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జి.జయలక్ష్మి, డీవోఎల్ఆర్ సెక్రెటరీ మనోజ్ జోషి జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షా్పని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. భూమి రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిగా రాష్ట్రాలదే అయినప్పటికీ ఈ పని చేస్తే రూ.కోట్లలో ప్రోత్సాహకాలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా నేటికీ చాలా రాష్ట్రాలు అడుగులు ముందుకు వేయడం లేదన్నారు. ఏపీతోపాటు గుజరాత్లో భూముల రీసర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ‘2000లో నేను అమెరికాకు వెళ్లాను. 2005లో స్థిరాస్తి కొనుగోలు చేసే ఆర్థిక శక్తి కలిగింది. రిజిస్ట్రేషన్ రోజున టైటిల్ కంపెనీ, ప్రభుత్వ అధికారి, రియల్టర్ ఇంటికే వచ్చి 10 పేపర్లపై సంతకాలు పెట్టించుకొని చెక్కు ఇవ్వమన్నారు. చెక్కు ఇచ్చిన వెంటనే ఇంటి తాళాలు చేతికిచ్చారు. దాంతో రిజిస్ట్రేషన్ అయిపోయింది’ అని వివరించారు. కాగా ఏపీలో 90 శాతం ఆర్వోఆర్ పూర్తయిందని, సర్వే, రీసర్వే కొంత పెండింగ్ ఉందని చెప్పారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయితే బ్యాంకులు సులభతరంగా రుణాలు ఇస్తాయని, పెట్టుబడిదారులు వ్యాపారాలు పెట్టేందుకు ముందుకొస్తారని, రైతుకు అన్ని విధాలుగా మద్దతు చేకూరుతుందని అన్నారు.
వైసీపీ హయాంలో రీసర్వే అస్తవ్యస్తం: అనగాని
గత వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వేని అస్తవ్యస్తం చేసిందని రెవెన్యూ మంత్రి అనగాని అన్నారు. తక్కువ సమయంలోనే 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసిందని, భూ యజమానులు అభ్యంతరాలు చెప్పుకొనేందుకు సరైన అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డీఐఎల్ఆర్ఎంపీ పూర్తి చేస్తున్నామని, తమకు ప్రోత్సాహకంగా రూ.400 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.