Share News

Simhachalam: చందనోత్సవంలో పెను విషాదం

ABN , Publish Date - May 01 , 2025 | 04:42 AM

సింహాచలం చందనోత్సవంలో పాల్గొన్న భక్తులపై ఇటీవల నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నాసిరకంగా నిర్మించిన గోడ వర్షానికి తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమిక సమాచారం

Simhachalam: చందనోత్సవంలో  పెను విషాదం

  • సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి

  • నాలుగు రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి

  • బలమైన పునాది లేదు.. నాసిరకంగా పనులు

  • సింహాచలంలో భారీ వర్షం, గాలులు

  • ఒక్కసారిగా కుప్పకూలిన రిటైనింగ్‌ వాల్‌

  • సిమెంటు ఇటుకలు, మట్టి కింద నలిగిన భక్తులు

  • ఒకే కుటుంబంలో నలుగురు మృతి

  • వారిలో మూడేళ్ల కిందట పెళ్లయిన యువజంట

  • మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా

  • విచారణకు కమిటీ ఏర్పాటు.. 72 గంటల్లో నివేదికకు సీఎం ఆదేశం.. ముర్ము, మోదీ దిగ్ర్భాంతి

  • దేవుడి శాఖకు ఇన్‌చార్జులే దిక్కు!ఈవోలూ అదనపు బాధ్యతల్లోనే

  • సింహగిరిపై నిర్లక్ష్యపు ‘గోడ’ హడావుడిగా నాసిరకం పనులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): సింహాచలం వరాహలక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వర్షపు నీటిని మళ్లించేందుకు నిర్మించిన గోడే... భారీ వర్షానికి కుప్ప కూలింది. సరైన నాణ్యత, బలమైన పునాదిలేకుండా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌... కట్టిన మూడు రోజులకే కూలిపోయింది. అప్పన్న నిజరూప దర్శనం కోసం... క్యూలో కదులుతున్న ఏడుగురు భక్తులను బలి తీసుకుంది. వీరిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన యువ దంపతులు. మరో ఇద్దరు కూడా వీరి కుటుంబీకులే. ఇంకో ఇద్దరు సన్నిహిత మిత్రులు!


edw.jpg

ఇలా జరిగింది...

చందనోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా... భారీ ఏర్పాట్లే చేశారు. వేర్వేరు క్యూలైన్లు నిర్మించారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వెళ్లారు. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో... 2.30 గంటలకు ఈదురుగాలులతో అరగంటపాటు భారీ వర్షం కురిసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లు కొన్ని కూలిపోయాయి. కరెంటు కూడా పోయింది. భక్తుల కోసం కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ పక్క నుంచి రూ.300 దర్శన వరుస ఏర్పాటు చేశారు. వర్షం పడితే కొండ పైనుంచి షాపింగ్‌ మాల్‌ వరకు వాన నీరు వస్తుండటంతో... ఇటీవలే అక్కడ రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. కేంద్రప్రభుత్వ నిధులతో ‘ప్రసాద్‌’ పథకం కింద చేపట్టిన ఈ గోడ నిర్మాణం నాలుగు రోజుల క్రితమే పూర్తయింది. బలమైన పునాదులు లేకుండా, కాంక్రీట్‌ ఇటుకలతో నిర్మించారు. సరిగ్గా క్యూరింగ్‌ కూడా కాలేదు. భారీవర్షానికి కొండ పైనుంచి నీరు ప్రవహించడంతో... ఆ ఒత్తిడికి గోడ కింద మట్టి కోసుకుపోయింది. తెల్లవారుజామున 3గంటలకు గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దాన్ని ఆనుకునే ఏర్పాటు చేసిన రూ.300 దర్శనం భక్తులపైకి సిమెంట్‌ ఇటుకలు పిడుగుల్లా పడ్డాయి. మట్టి కూడా ముంచెత్తింది. చిమ్మ చీకటి... వర్షం... అంతలోనే భారీ శబ్దం... కేకలు, అరుపులతో క్యూలైన్లలోని భక్తులు ఆందోళనకు గురయ్యారు. సెల్‌ఫోన్‌ టార్చ్‌ వేసి చూశారు. గోడ కూలి, దాని కింద పలువురు చిక్కుకున్న విషయం గుర్తించారు. వెంటనే పెద్దగా కేకలు వేస్తూ సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లి అంబులెన్స్‌లు వచ్చేసరికి 20 నిమిషాలు దాటింది.


వెంటనే ఆ క్యూలైన్‌ను మూసేసి, భక్తులను అక్కడి నుంచి పంపించేసి కలెక్టర్‌ హరేంధిర ప్రసా ద్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ సహాయక చర్యలు పర్యవేక్షించారు. హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది వచ్చి మృతదేహాలను బయటకు తీశారు. అంబులెన్సుల్లో అపోలో ఆస్పత్రికి తరలించారు. అంతా మరణించారని చెప్పడంతో పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సహాయక చర్యలు ఉదయం ఏడు గంటల వరకు సాగాయి. ఇంకా రాళ్ల కింద ఎవరైనా ఉన్నారేమోనని మంత్రి అనిత, దేవదాయ శాఖ సెక్రటరీ వినయ్‌చంద్‌ దగ్గరుండి రాళ్లు, మట్టి పూర్తిగా తీయించారు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అధికారులు, మంత్రి కేజీహెచ్‌కు వెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

efre.jpg

మృత్యువులోనూ వీడని స్నేహబంధం

ఎక్కడికైనా కలిసివెళ్లడం ఆ స్నేహితులకు అలవాటు. పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ విశాఖలోనే కలిసి ఉంటున్నారు. స్వామివారి చందనోత్సవంలో పాల్గొనేందుకు కూడా కలిసే సింహాచలం వెళ్లారు. అక్కడ గోడ కూలి ఇద్దరూ మృతిచెందారు. పత్తి దుర్గాస్వామినాయుడు(28), కుంపట్ల మణికంఠ ఈశ్వరశేషారావు(శివ)(29)లది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని కొర్లపాటివారిపాలెం. స్వామినాయుడు వైజాగ్‌లో డైమండ్‌ ఇంటీరియర్‌ వర్కర్‌గా, శేషారావు వైజాగ్‌ మెట్రో కంపెనీలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ జనసేన పార్టీ కార్యకర్తలు. వారి మరణం బాధించిందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. అండగా ఉంటామని వారి కుటుంబాలకు లేఖను పంపించారు.


కళ్లముందే దారుణం జరిగిపోయింది

‘‘మేము తగరపువలస నుంచి స్వామి దర్శనం కోసం వచ్చాం. రూ.300 టిక్కెట్లు తీసుకున్నాం. వాటిని స్కానింగ్‌ చేసి క్యూలైన్‌లో మెట్లు ఎక్కి పైకి వచ్చాం. మా ముందే ఆ భార్యాభర్తలిద్దరూ (పిళ్లా మహేశ్‌, శైలజ దంపతులు), వాళ్ల పెద్దలు ఉన్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. గోడ కూలిపోయింది. కాంక్రీట్‌ ఇటుకల కింద వారు ఉండిపోయారు. కళ్ల ముందే దారుణం జరిగిపోయింది. భయంతో మేం వెనక్కి వచ్చేశాం.’’

- లక్ష్మి, తగరపువలస

sd.jpgపెద్ద శబ్దం... రాళ్లు మీద పడ్డాయి

‘‘తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో వర్షం మొదలైంది. కరెంట్‌ పోయింది. చిమ్మచీకటి. కొద్దిసేపటికి మేం ఉన్న చోట పెద్ద శబ్దంతో గోడ కూలిపోయింది. కాంక్రీట్‌ రాళ్లు వచ్చి మీద పడ్డాయి. కింద కొందరు ఉండిపోయారు. నేను మరో ఇద్దరం కలిసి కింద ఉన్న ఓ వృద్ధురాలిని బయటకు తీసే ప్రయత్నం చేశాం. నా కాళ్లపైనా రాళ్లు వచ్చి పడ్డాయి.’’

- రవికుమార్‌, జీవీఎంసీ

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి


wD.jpg

యువ దంపతుల విషాదాంతం

  • మూడేళ్ల క్రితమే వివాహం... ఇద్దరూ టెకీలే

  • భార్య, ఆమె తల్లి, మేనత్తతో కలిసి దర్శనానికి..

  • గోడ కూలిన ఘటనలో నలుగురూ మృతి

వారికి మూడేళ్ల కిందటే వివాహమైంది... ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే! అప్పన్న నిజరూప దర్శనం చేసుకోవాలన్నది వారి చిరకాల కోరిక! ఇన్నాళ్లకు కుదిరిందని వెళ్లారు! గోడ కూలిన దుర్ఘటనలో కన్నుమూశారు. ఇది... విశాఖపట్నానికి చెందిన ఉమామహేశ్వరరావుకు(30), శైలజ (26)ల విషాద గాథ. ఇదే ఘటనలో శైలజ తల్లి, మేనత్త కూడా దుర్మరణం పాలయ్యారు. ఉమామహేశ్వరావును కుటుంబ సభ్యులు మహేశ్‌గా పిలుస్తారు. మహేశ్‌ హెచ్‌సీఎల్‌ కంపెనీలో పనిచేస్తుండగా, శైలజ ఇన్ఫోసి్‌సలో పనిచేస్తున్నారు. వివాహమైన తర్వాత స్వగ్రామంలో ఉంటూ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసుకుంటున్నారు. అప్పన్న నిజరూప దర్శనానికి మహేశ్‌ నాలుగు టిక్కెట్లు తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం భార్య శైలజ, ఆమె తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త మహాలక్ష్మితో కలిసి సింహాచలం చేరుకున్నారు. అర్ధరాత్రి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. అదే సమయంలో ఒక్కసారిగా గోడ కూలడంతో క్యూలైన్‌లోనే ఉన్న వీరు నలుగురూ మృత్యువాతపడ్డారు. మహేశ్‌ సోదరికి ఇద్దరు పిల్లలు. ఆమె భర్త రెండేళ్ల కిందట మరణించారు. ఆ కుటుంబం బాగోగులు కూడా మహేశ్‌ దంపతులే చూసు కుంటున్నారు. తమ పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ కుమారుడిని ఇంజనీరింగ్‌ చదివించామని, చేతికి అందొచ్చిన కొడుకుతో పాటు కోడలు కూడా మృతిచెందడంతో దిక్కులేని వారిగా మిగిలిపోయామని మహేశ్‌ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.


మృతుల వివరాలు....

1. పిళ్లా మహేశ్‌ (30), చంద్రంపాలెం,

మధురవాడ, విశాఖపట్నం

2. పిళ్లా శైలజ (27), మహేశ్‌ భార్య.

(వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు)

3. పైలా వెంకట రత్నం(45), హెచ్‌బీ కాలనీ,

విశాఖపట్నం (ఈమె శైలజ తల్లి)

4. గుజ్జారి మహాలక్ష్మి (65), ఇసుకతోట,

విశాఖపట్నం (శైలజ మేనత్త)

5. కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29),

అంబాజీపేట, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా.

6. పత్తి దుర్గాస్వామి నాయుడు (30),

అంబాజీపేట, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా.

7. ఎడ్ల వెంకటరావు(58). అడవివరం, విశాఖపట్నం


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:39 AM