Friendly Peak Climb: ఫ్రెండ్లీ పీక్ పర్వతారోహణలో అపశ్రుతి
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:28 AM
కులుమనాలిలోని ఫ్రెండ్లీ పీక్ పర్వతాన్ని అధిరోహిస్తూ విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సీనియర్ ఇంజనీరు అడుసుమల్లి లక్ష్మణరావు (62) గుండెపోటుతో మృతిచెందారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు...

కులుమనాలిలో గుండెపోటుతో బెజవాడ వాసి మృతి
పెనమలూరు, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): కులుమనాలిలోని ఫ్రెండ్లీ పీక్ పర్వతాన్ని అధిరోహిస్తూ విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సీనియర్ ఇంజనీరు అడుసుమల్లి లక్ష్మణరావు (62) గుండెపోటుతో మృతిచెందారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, లింగాల రవీంద్ర, బొబ్బా గోపాలకృష్ణ, వంశీకృష్ణ, గౌతంరెడ్డి, అడుసుమల్లి లక్ష్మణరావు ఇటీవల కులుమనాలి వెళ్లారు. శనివారం అక్కడికి సమీపంలో 18 వేల అడుగుల ఎత్తున్న ఫ్రెండ్లీ పీక్ పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు. మూడున్నర వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న లక్ష్మణరావుకు ఒక్కసారిగా ఆయాసం, గుండెదడ ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలి మృతిచెందారు. దీంతో బృందం వెనుదిరిగింది. కులుమనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లక్ష్మణరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆదివారం విజయవాడ తీసుకొచ్చారు.