Share News

Minister Nadendla Manohar: అన్ని రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:54 AM

రాష్ట్రంలోని అన్ని రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు, క్యూఆర్‌ కోడ్‌లతో సరుకుల పంపిణీలో పారదర్శకతను తీసుకురావాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. పోర్టబులిటీ ద్వారా ఎక్కడినుంచైనా రేషన్‌ సరుకులు పొందే సౌకర్యం కల్పించామన్నారు.

Minister Nadendla Manohar: అన్ని రేషన్‌ షాపుల్లో  సీసీ కెమెరాలు

  • సరుకుల పంపిణీలో పారదర్శకత

  • ఫిర్యాదులకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌..

  • ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు

  • పోర్టుల వద్ద చెక్‌పోస్టులతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట

  • కొత్తగా 7 లక్షల దరఖాస్తులు: మంత్రి నాదెండ్ల

  • రేషన్‌ షాపుల్లో సరుకుల పంపిణీ ప్రారంభం

పిఠాపురం,/పిఠాపురం రూరల్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రేషన్‌ షాపుల్లో సరుకుల పంపిణీని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. అన్ని రేషన్‌ డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రేషన్‌ షాపు వద్ద ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు. వీటిని పౌరసరఫరాల శాఖ కమిషనరు నేతృత్వంలోని కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ షాపుల్లో సరుకుల పంపిణీని ఆదివారం ఆయన ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం 18వ వార్డులోని రేషన్‌ షాపులో కార్డుదారులకు మంత్రి నాదెండ్ల సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 29,761 రేషన్‌ షాపుల ద్వారా 1.44కోట్ల మంది కార్డుదారులు, 4.42 కోట్ల మంది ప్రజలకు సరుకుల పంపిణీని ప్రారంభించామన్నారు. 15.65 లక్షల మంది దివ్యాంగులు, 65 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు 5వ తేదీలోగా డీలర్లు ఇంటింటికి వెళ్లి సరుకులు అందజేస్తారని చెప్పారు. పోర్టబులిటీ విధానం అమలు కోసం ప్రతి రేషన్‌ డిపోకు అదనంగా 10శాతం సరుకులు ఇచ్చామన్నారు. కార్డుదారులు ఎక్కడి నుంచైనా తమకు అందుబాటులో ఉన్న రేషన్‌ షాపు ద్వారా సరుకులు తీసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.


రేషన్‌ షాపుల ద్వారా పంపిణీని అడ్డుకునేందుకు పలువురు కోర్టుల ద్వారా ప్రయత్నం చేశారని, వాటిని ప్రభుత్వం అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. పోర్టుల వద్ద చెక్‌పోస్టులు, నిఘా ఏర్పాటుచేసి బియ్యం అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన కార్డులు, కుటుంబసభ్యుల చేర్పు, తొలగింపులు, చిరునామా మార్పు తదితరాల కోసం 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, 21 రోజుల్లోగా వీటిని పరిష్కరించి కొత్త కార్డులు అందజేస్తామని చెప్పారు. ఎండీయూ వాహనాలు తొలగించి, రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీని పునరుద్ధరించడంతో ప్రభుత్వానికి రూ.385 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌, ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ, పెండెం దొరబాబు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ తోట సుధీర్‌, ఆ శాఖ కమిషనర్‌ సౌరభ్‌గౌర్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

సుపరిపాలనకు ఏడాది.. 4న రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు..

సుపరిపాలనకు ఏడాది, రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది పేరుతో ఈనెల 4న జనసేన శ్రేణులంతా సంక్రాంతి, దీపావళి పండుగలు ఒకే రోజున చేయాలని నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం కుమారపురంలో జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 4న ఉదయం రంగవల్లుల పోటీలు, సాయంత్రం బాణసంచా కాల్చి ఆ చిత్రాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయాలని సూచించారు.

Updated Date - Jun 02 , 2025 | 04:55 AM