Share News

Minister Nadendla Manohar: రెండు రోజుల్లో 34 లక్షల కుటుంబాలకు రేషన్‌ పంపిణీ

ABN , Publish Date - Jun 03 , 2025 | 03:51 AM

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండు రోజుల్లోనే 34 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేయబడినట్టు వెల్లడించారు.

Minister Nadendla Manohar: రెండు రోజుల్లో 34 లక్షల కుటుంబాలకు రేషన్‌ పంపిణీ

  • దుకాణాల ప్రారంభంపై లబ్ధిదారుల హర్షం

  • ప్రతి బియ్యం బస్తాపైనా క్యూఆర్‌ కోడ్‌

  • రేషన్‌ అక్రమ రవాణాకు చెక్‌: మంత్రి నాదెండ్ల

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు క్యూఆర్‌ కోడ్‌తో అడ్డుకట్ట వేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇక నుంచి రేషన్‌ షాపులకు తరలించే ప్రతి బియ్యం బస్తాకూ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దాని ఆధారంగా అక్రమ రవాణాను అరికట్టవచ్చన్నారు. త్వరలోనే అన్ని రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి రేషన్‌ షాపు దగ్గర క్యూఆర్‌ కోడ్‌ను అందుబాటులో ఉంచామని, సరుకుల పంపిణీలోగాని, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లుగాని ప్రజలు గుర్తిస్తే వెంటనే ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ భవన్‌లో మంత్రి మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్‌ సరుకుల పంపిణీని ప్రారంభించగా.. సోమవారం మధ్యాహ్నం 4 గంటల వరకు డీలర్లు 34.81 లక్షల కుటుంబాలకు సరుకులు అందించారని చెప్పారు. 15.74 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దే రేషన్‌ సరుకులు అందించాలని డీలర్లను ఆదేశించినట్టు తెలిపారు. వారిలో 3,73,062 మందికి ఈ రెండు రోజుల్లోనే సరుకులు అందించారని పేర్కొన్నారు.


అయితే, కొన్నిచోట్ల ఈ-పో్‌సలో సాంకేతిక సమస్యలు, సర్వర్లు మొరాయించడంతో సరుకుల పంపిణీకి అంతరాయం ఏర్పడుతోందని, ఈ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ తమకు ప్రయోజనకరంగా ఉన్నట్లు అన్ని జిల్లాల లబ్ధిదారుల నుంచి తమకు సమాచారం వచ్చినట్టు తెలిపారు. రేషన్‌ తీసుకోని కార్డుదారులకు డీబీటీ ద్వారా నగదు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. దీపం-2 పథకం కింద రెండో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకున్న లబ్ధిదారులకు కొంతమందికి రాయితీ డబ్బులు జమ కాకపోవడానికి సాంకేతికపరమైన సమస్యలే కారణమని చెప్పారు. త్వరలోనే అందరికీ సబ్సిడీ సొమ్మును జమ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడో విడత ఉచిత సిలిండర్‌కు సంబంధించిన రాయితీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ముందుగానే జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Updated Date - Jun 03 , 2025 | 03:55 AM