Share News

Teacher Unions Discussion: ఉపాధ్యాయ సంఘాలతో కొలిక్కిరాని చర్చలు

ABN , Publish Date - May 20 , 2025 | 04:17 AM

ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు చర్చలు జరిపినా పెద్ద ఒప్పందం కలదు లేదు. మీడియం, విద్యార్థుల నిష్పత్తిపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాచరణ కొనసాగిస్తాయని ప్రకటించాయి.

Teacher Unions Discussion: ఉపాధ్యాయ సంఘాలతో కొలిక్కిరాని చర్చలు

  • మీడియం, విద్యార్థుల నిష్పత్తిపై సంఘాల పట్టు

  • రేపు డీఈవో ఆఫీసుల ముట్టడి యథాతథం

  • సంఘాల ప్రతినిధులతో అధికారుల సుదీర్ఘ చర్చలు

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): పాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం నిర్వహించిన చర్చలు కొలిక్కిరాలేదు. సంఘాల ప్రతినిధులు చేసిన డిమాండ్లపై అధికారుల నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో తమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. బుధవారం ఉమ్మడి 13 జిల్లాల్లోని జిల్లా విద్యాశాఖ అధికారుల(డీఈవో) కార్యాలయాల ముట్టడి కొనసాగుతుందని స్పష్టంచేసింది. కాగా, ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయంపై సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల బదిలీలకు ప్రభుత్వం సన్నద్ధమైన సమయంలో వాటిలో అనేక మార్పులు కోరుతూ ఈ నెల 16న అధికారులకు ఐక్య వేదిక నోటీసు ఇచ్చింది. దశలవారీగా ఉద్యమం చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, డైరెక్టర్‌ వి. విజయరామరాజు సోమవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఐక్య వేదిక ప్రతినిధులతో చర్చలు జరిపారు. చాలా అంశాల్లో సానుకూలత వచ్చినా కొన్ని అంశాల్లో డిమాండ్లు పరిష్కరించకపోవడంతో తమ కార్యాచరణ కొనసాగిస్తామని ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ఆంగ్లంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం, ఇతర మీడియంలను కొనసాగించాలని, ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్‌ ఇవ్వాలని ప్రతినిధులు పట్టుబట్టారు. మీడియం గత కొన్నేళ్లుగా కొనసాగుతోందని, దానిని ఇప్పుడు మార్చలేమని అధికారులు స్పష్టంచేశారు. పైగా, అది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపారు.


అలాగే, ఉన్నత పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్‌ ఇస్తున్నారని, దానికి బదులుగా 45 మంది దాటితే రెండో సెక్షన్‌ ఇవ్వాలని కోరగా అది సాధ్యంకాదని అధికారులు తెలిపారు. మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు ప్రధానోపాధ్యాయులుగా మొత్తం ఎస్జీటీలనే నియమించాలని, ఫౌండేషనల్‌ స్కూల్స్‌ విధానం రద్దు చేయాలని ఐక్యవేదిక కోరగా.. దానిపైనా సానుకూల నిర్ణయం రాలేదు. ఫౌండేషనల్‌ స్కూళ్లలో టీచర్లు, విద్యార్థుల మధ్య నిష్పత్తిని 1:20కి తగ్గిస్తామని, స్టడీ లీవ్‌లో ఉన్నవారి పోస్టులను ఖాళీలుగా చూపబోమని, బదిలీల్లో పోస్టులు బ్లాక్‌ చేయబోమని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే 1400 మంది ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పదోన్నతి కల్పిస్తామని, మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో 120 మంది దాటితే అదనపు ఎస్జీటీని ఇస్తామని అధికారులు చెప్పారు. జూలైలో ఎంఈవోల బదిలీలు చేపడతామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ.. సమాంతర మీడియం, 45 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్‌ ఇవ్వడంపై సంఘాలు గట్టిగా పట్టుబట్టాయి. కనీసం మండలానికి ఒకటైనా తెలుగు మీడియం పాఠశాల పెట్టాలని కోరాయి. అలాగే సమస్యలపై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌తో చర్చలకు సంఘాలు డిమాండ్‌ చేశాయి. వీటిపై అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

Updated Date - May 20 , 2025 | 04:19 AM