Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మంది అరెస్ట్
ABN , Publish Date - Jun 14 , 2025 | 02:14 PM
Podili Attack Case: పొదిలి దాడి కేసులో మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మహిళలు, పోలీసులపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి.

ప్రకాశం, జూన్ 14: పొదిలి దాడి కేసులో (Podili Attack Case) మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) పర్యటనకు వెళ్లినప్పుడు వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న మహిళలపై వైసీపీ మూకలు దాడి చేశాయి. మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు, ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. జగన్ పర్యటనలో నిబంధనలను ఉల్లంఘించారంటూ వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ వచ్చారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అదే సమయంలో సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానికంగా ఉన్న మహిళలు జగన్కు వ్యతిరేకంగా నల్లబెలూన్లు, ప్లకార్డు ప్రదర్శించారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ మూకలు.. నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
దీంతోపాటు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తలపై ర్యాలీగా వెళ్తున్న వైసీపీ కార్యకర్తలు నేరుగా గురి చూసి చెప్పులతో దాడి చేసిన దృశ్యాలు పోలీస్ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సీఎం చంద్రబాబు.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ నెల 12న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలతోపాటు పోలీసులపై దాడి చేసిన వారి ముఖాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలీసులు అరెస్ట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పొదిలి కోర్టులో 15 మంది నిందితులను హాజరుపర్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మరికొంతమంది నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసమూ గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్కు ఇజ్రాయెల్ క్షమాపణలు..
Read Latest AP News And Telugu News