Narendra Modi: ఆప్త మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:57 AM
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, చిరంజీవి తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన చూపిస్తున్న కృషి, దార్శనికతకు ప్రశంసలు అందాయి

అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న మీ తీరు ప్రశంసనీయం. భవిష్యత్తులో రాణించే రంగాలపై దృష్టిసారించి ముందుకు వెళుతున్న విధానం అభినందనీయం. నా ఆప్తమిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. నిబద్ధతతో కూడిన మీ ప్రయత్నాలు ఏపీని మరింత ఉన్నతస్థానంలో నిలబెడుతుందని నమ్ముతున్నానని, ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. దార్శనికత, కృషి, పట్టుదల అంకితభావం ఉన్న అరుదైన నాయకుడంటూ కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. వీరి ట్వీట్లను రీట్వీట్ చేసిన చంద్రబాబు.. ప్రధాని, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆయన తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కూడా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, హర్దీ్పసింగ్ పూరీ, కుమారస్వామి, కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, కుమార స్వామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు, సినీ నటులు సోనూ సూద్, నారా రోహిత్ తదితరులు ఉన్నారు. ఇక, ప్రతి ఒక్కరి పోస్టును రీ పోస్టు చేస్తూ అందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.