Share News

Piyush Goyal: పొగాకు అదనపు సాగు వద్దు

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:50 AM

రాష్ట్రంలో అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదేశించారు. చాలా చోట్ల అదనంగా పొగాకు సాగు చేస్తుండటం వల్ల సమస్యలు...

 Piyush Goyal: పొగాకు అదనపు సాగు వద్దు

  • దీంతో రైతులకు ఇబ్బందులే

  • ఏపీలో కొత్తగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం

  • పొగాకు రైతులకు వడ్డీలేని రుణాలు

  • వారి పిల్లలకు విదేశీ భాషల్లో శిక్షణ

  • కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌

గుంటూరు, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదేశించారు. చాలా చోట్ల అదనంగా పొగాకు సాగు చేస్తుండటం వల్ల సమస్యలు ఉత్పన్న మవుతున్నాయన్నారు. ఆదివారం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి వచ్చిన ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘‘గత నాలుగేళ్లలో పాగాకు రైతుల ఆదాయం రెట్టింపు అయింది. అది అలానే కొనసాగాలంటే అదనపు విస్తీర్ణంలో పొగాకు సాగు చేయరాదు. ఈ విషయంలో బోర్డు పరంగా అవసరమైన చర్యలు తీసుకొంటాం. పొగాకు రైతులకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను బోర్డు ఇస్తోంది. రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలను రైతుల పిల్లల చదువుల కోసం మంజూరు చేస్తోంది. తీసుకొన్న రుణాలను ఐదేళ్లలోపు చెల్లించే విధంగా నిబంధనలను సడలించాం. పొగాకు రైతుల పిల్లలకు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణతో పాటు జర్మనీ, జపాన్‌ భాషల్లో కూడా శిక్షణ ఇస్తున్నాం. దీని వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగాల సాధనకు ఆస్కారం ఉంటుంది’’ అని మంత్రి వివరించారు.


ఎన్‌ఐడీలో పురోగతి!

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌(ఎన్‌ఐడీ).. ఏపీలో పురోగతిలో ఉందని కేంద్ర మంత్రి గోయల్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌గా మారుతుందన్నారు. కొత్తగా పరిశ్రమల ఏర్పాటు, ఏపీ నుంచి ఎగుమతులను పెంచే విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు. ‘‘పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలకు లాభం జరిగేలా ఏ నిర్ణయమైనా తీసుకొంటాం. మౌలిక వసతులు, పర్యాటకం, ఏరో స్పేస్‌, కెమికల్స్‌ తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుదల సాధనపై సీఎంతో చర్చించాం. కృష్ణపట్నం పార్కు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా రాబోయే రోజుల్లో వేలాది మందికి కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఈ సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌, ఈడీ విశ్వశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 03:51 AM