Modi NDA Meeting: హస్తినకు వెళ్లిన పవన్
ABN , Publish Date - May 25 , 2025 | 05:02 AM
పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి ఎన్డీయే సీఎం, ఉప సీఎం సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ‘సిందూర్’ ఆపరేషన్ విజయాన్ని పురస్కరించి, కులగణనపై కీలక తీర్మానాలు తీసుకోనున్నారు.

నేడు ఎన్డీయే భేటీకి హాజరు
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం
సిందూర్, కులగణనపై తీర్మానాలు
న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం అశోకా హోటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరగనుంది. ఎన్డీయే సమావేశానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. ఈ భేటీలో రెండు తీర్మానాలను ఆమోదించనున్నారు. ఆపరేషన్ ‘సిందూర్’ను విజయవంతంగా నిర్వహించిన భారత రక్షణ దళాలు, ప్రధానిని అభినందించడం, త్వరలో చేపట్టే జనగణనలో కులగణన నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్డీయే సీఎంలు అభినందనలు తెలిపే తీర్మానాలను ఆమోదించనున్నారు. ఈ భేటీకి సీఎం చంద్రబాబు హాజరు కాలేకపోతున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో నీతి ఆయోగ్ సమావేశం తరువాత ఢిల్లీ నుంచి ఏపీకి తిరిగి వచ్చారు.