Jana Sena: బలమైన పార్టీగా నిర్మిస్తాం
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:03 AM
జనసేనను రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ఆవిర్భావ సభను సక్సెస్ చేసినవారికి కృతజ్ఞతలు: పవన్
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జనసేనను రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించిన ‘జయకేతనం’ ఆవిర్భావ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ బుధవారం ‘ఎక్స్’లో ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్లో తమ పార్టీ సామాన్యుల గొంతుకగా మారుతుందని, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా, మరింత బాధ్యతతో పనిచేసే దిశగా అడుగులు వేయనుందని తెలిపారు. జనసేన 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని.. 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొన్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరికి, ఎన్డీయే నాయకులు, చిత్ర పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
‘ముందుగా ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు, అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీసు శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ హరిష్ కుమార్గుప్తా, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్కి, సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్కు క్షేత్రస్థాయిలో పని చేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారికి, కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎంపీ ఉదయ్, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ధన్యవాదాలు. తీవ్రమైన ఎండ ఉన్నప్పటికి, కార్యక్రమానికి విచ్చేసినవారికి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీకి, సభకు స్థలాన్ని అందించిన దాతలకు, పారిశుధ్య సిబ్బందికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.