Deputy CM Pawan Kalyan: దుష్టశక్తులను తరిమికొడదాం
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:46 AM
హిందూమతాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ, హేళనగా మాట్లాడమే లౌకికవాదంగాప్రకటించుకునే దుష్టశక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

హందూ మతాన్ని విమర్శిస్తూ.. హేళనగా మాట్లాడుతున్నారు
హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు పత్తాలేకుండా పోతారు
మురుగన్ భక్తుల మహానాడులో డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
చెన్నై, జూన్ 22(ఆంధ్రజ్యోతి): హిందూమతాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ, హేళనగా మాట్లాడమే లౌకికవాదంగాప్రకటించుకునే దుష్టశక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని మదురైలో హిందూ మున్నని, ఆర్ఎ్సఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో ఆయన పాల్గొన్నారు. వేదికపై ఆశీనులైన ఆయన తమిళ సంప్రదాయాన్ని తలపించేలా ధోవతి, చొక్కా, ఆకుపచ్చ రంగు అంగవస్త్రం ధరించారు. తన ప్రసంగంలో స్పష్టమైన తమిళంలో మాట్లాడి, ఆకట్టుకున్నారు. హిందూ దేవుళ్లను పనిగట్టుకుని విమర్శించే నాస్తికవాదులు.. అరేబియా నుంచి దేశంలోకి దిగుమతి అయిన మతాలను గానీ, ఆ మతాలకు చెందిన దేవుళ్లను గానీ విమర్శించగలరా అని పవన్ నిలదీశారు. హిందువులు ఎప్పుడు సహనం పాటిస్తారని, ఆ సహనశీలురంతా ఒక్కటైతే నాస్తికవాదులంతా పత్తాలేకుండా పోతారని హెచ్చరించారు.
ఈ సందర్భంగా తమిళ సామెత ‘సాధుమిరండాల్ కాడు కొల్లాదు’ (సజ్జనుడికి, సహనశీలికి ఆగ్రహం వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు)ను ఆయన ఉటంకించారు. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు, దేవుళ్లను విమర్శించి అధికారంలోకి వచ్చినవారు (డీఎంకే పాలకులు) అడ్రస్ లేకుండా పోతారని స్పష్టం చేశారు. ‘రాజ్యంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని నాస్తికవాదులు రెచ్చిపోతూ హిందూ దేవుళ్లను విమర్శిస్తున్నారు. మురుగన్ భక్తులు గానం చేసే స్కంధ షష్టి కవచాన్ని హేళన చేశారు. ఆధ్యాత్మిక పునాదులను కదిపేందుకు ప్రయత్నిస్తున్న వారి కుటిల యత్నాలు ఎన్నటికీ ఫలించవు. మురుగన్ భక్తులందరూ ఓ చూపు చూస్తే చాలు.. దేవుడిని తిట్టే వారంతా దేశం నుంచే పారిపోతారు. పరమ శివుడు మూడో కన్ను తెరిచిన పవిత్ర భూమి తమిళనాడే. అలాంటి చోట ఆధ్మాత్మిక భావాలకు, ప్రత్యేకించి హిందువుల మత విశ్వాసాలకు భంగం కలిగిస్తే భక్తులు చూస్తూ ఊరుకోరు’ అని పవన్ హెచ్చరించారు.
‘ఇల్లేమో దూరం, అంతటా గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా మిట్టాపల్లాలు, అయినా మనసులో ధైర్యం ఉంది. అది చాలు’ అనే తెలుగు కవితకు అద్దం పట్టేలా తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లు మురుగన్ భక్తులందరికీ ‘అచ్చమిల్లై... అచ్చమిల్లై’ (భయం లేదు.. భయం లేదు) అంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలపై దుమ్మెత్తి పోసేవారిపై సమైక్య ఉద్యమం చేపట్టేలా మహానాడులో తీర్మానం చేయాలని కోరారు. నాగుపాము బుస కొడితేనే చిట్టెలుకలు పారిపోతాయని, ఆ రీతిలో పరమేశ్వరుడి మెడలోని నాగుపాము బుస కొడితే నాస్తికవాదులనే ఎలుకలు సైతం పత్తా లేకుండా పోతాయన్న తిరుక్కురళ్ సూక్తిని ఆయన తమిళంలో వినిపించారు. నండ్రి, వణక్కమ్ (ధన్యవాదాలు, నమస్కారం) అంటూ పవన్ ప్రసంగాన్ని ముగించారు.