Share News

AP Deputy CM: గ్రామాభివృద్ధిలో భాగస్వాములవ్వండి

ABN , Publish Date - May 23 , 2025 | 05:02 AM

గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రావివలస గ్రామానికి రూ.15 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు.

AP Deputy CM: గ్రామాభివృద్ధిలో భాగస్వాములవ్వండి

  • ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌ పిలుపు.. రావివలస గ్రామస్థులతో ‘మాటామంతీ’

  • వివిధ సమస్యల పరిష్కారానికి చర్యలు.. అభివృద్ధి పనులకు రూ.15 కోట్ల నిధులు

టెక్కలి, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఉన్నత స్థాయిలో ఉన్న స్థానికులు ఊరిని మర్చిపోకూడదు. గ్రామాభివృద్ధికి కృషి చేయాలి’ అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘మన ఊరికోసం మాటామంతీ’ కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన మాట్లాడారు. టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రావివలసలో ఎండలమల్లికార్జున స్వామి ఆలయానికి టూరిజం, దేవదాయశాఖ ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేద్దామన్నారు. గ్రామంలో గ్రంథాలయం, రోడ్లు, కాలువలు, క్రీడామైదానాలు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శిస్తానని తెలిపారు.


ఆధ్యాత్మిక కేంద్రంగా రావివలస: మంత్రి అచ్చెన్న

మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. స్థానిక సంస్థల నిధులు ఇతర రంగాలకు మళ్లించారు. స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, అధికారాల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న కృషి అభినందనీయం. రావివలసను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. జలజీవన్‌ మిషన్‌ ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. ప్రకృతి వ్యవసాయాన్ని రెట్టింపు చేస్తాం’ అని తెలిపారు. మాజీ జడ్పీటీసీ ఎల్‌.ఎల్‌.నాయుడు మాట్లాడుతూ.. ‘రావివలసలో ఎండల మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే మార్గాన్ని విస్తరించాలి. గ్రామంలో ఇంటర్నల్‌ డ్రైనేజ్‌ సదుపాయం కల్పించాలి. అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలి. శ్మశానవాటికకు రోడ్డు, సీత పుష్కరిణికి మెట్లు సదుపాయం కల్పించాలి’ అని కోరారు. దీనిపై పవన్‌కల్యాణ్‌ స్పందిస్తూ.. ‘సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేద్దాం. డ్రైనేజ్‌ నిర్మాణాల్లో చాలాచోట్ల లోపాలున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. శ్మశానవాటికకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఎండల మల్లన్న ఆలయానికి వెళ్లే రహదారి విస్తరణకు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - May 23 , 2025 | 05:04 AM