KA Paul: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కౌంటర్ వేయండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:31 AM
పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. హత్యగా చిత్రీకరించాలంటూ కేసును సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ పిల్ వేశారు.

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హత్య చేసి ప్రమాదమంటున్నారు
దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి: కేఏ పాల్
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్కుమార్ పగడాల మరణంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ డీఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పిల్ దాఖలు చేశారు. పోస్టుమార్టం నివేదికతో పాటు సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాక్ష్యాలన్నిటినీ భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇదే అభ్యర్థనతో రాజమండ్రికి చెందిన దాడి నాగేశ్వరరావు మరో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా కేఏ పాల్ ‘పార్టీ-ఇన్-పర్సన్’గా తన వ్యాజ్యంపై తానే వాదనలు వినిపించారు. పాస్టర్ ప్రవీణ్ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని.. పోలీసులు కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.
ప్రవీణ్కు మద్యం సేవించే అలవాటు లేదన్నారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) ఎస్.ప్రణతి స్పందిస్తూ.. ప్రవీణ్ మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడిపారని.. ప్రమాదవశాత్తూ కిందపడి మరణించారని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు కోర్టు అనుమతించింది.