Tirumala: పాదాల మండపం పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:24 AM
అలిపిరిలోని అతి ప్రాచీనమైన పాదాల మండపం పరిరక్షణకు అడుగులు పడుతున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు బుధవారం మండపాన్ని పరిశీలించారు.

పరిశీలించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బృందం
తిరుమల, జూన్ 11(ఆంధ్రజ్యోతి): అలిపిరిలోని అతి ప్రాచీనమైన పాదాల మండపం పరిరక్షణకు అడుగులు పడుతున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు బుధవారం మండపాన్ని పరిశీలించారు. దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మితమై శిథిలావస్థకు చేరుకున్న ఈ కట్టడాన్ని తిరుమలలోని పార్వేట మండపం తరహాలో తొలగిస్తారంటూ వైసీపీ ప్రభుత్వంలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలోనే మండపాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం పాదాల మండపం పరిరక్షణకు చర్యలు చేపట్టింది. ఆర్కియాలజీ అధికారి మునిరత్నంరెడ్డి సహకారంతో ఆ విభాగాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలోనే ఏఎ్సఐ రిటైర్డ్ డైరెక్టర్ జమ్వాల్(పూణే), ఇంజనీరింగ్ అధికారులు, విశాల్ బృందం, ‘లార్డ్ వెంకటేశ్వర రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు(పూణే) దాతలతో కలిసి బుధవారం మండపాన్ని పరిశీలించారు. ప్రాచీన పద్ధతుల్లోనే కట్టడాన్ని పరిరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు.