Share News

CPI Narayana: ఆపరేషన్‌ సిందూర్‌పై వాస్తవాలు ప్రకటించండి

ABN , Publish Date - May 19 , 2025 | 05:10 AM

ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వాస్తవాలు వెల్లడించాలని సీపీఐ ఎంపీ సంతోశ్ కుమార్‌, జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండు చేశారు. బీజేపీ ఒకపక్ష నిర్ణయాలతో దేశ భద్రతకు ప్రమాదం కలిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

CPI Narayana: ఆపరేషన్‌ సిందూర్‌పై వాస్తవాలు ప్రకటించండి

  • ఎంపీ సంతోశ్‌ కుమార్‌, నారాయణ

తిరుపతి(ఆటోనగర్‌), మే 18(ఆంధజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని సీపీఐ రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ కుమార్‌, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండు చేశారు. తిరుపతిలో ఆదివారం వీరు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘పాకిస్థాన్‌పై జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. ఉన్నపళంగా అగ్రదేశం చేసిన ప్రకటనతో సీజ్‌ ఫైర్‌కు ఆమోదం తెలపడం వెనుక పలు అనుమానాలు ఉన్నాయి. అఖిల పక్ష పార్టీలు, ఎంపీలతో చర్చలు జరపకుండా, బీజేపీ తనకు అనుకూలమైన వారికే ఆహ్వానం పలికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో దేశానికి ప్రమాదం పొంచి ఉంది. దౌత్య చర్చలకు పార్టీల ప్రమేయం లేకుండా సభ్యులను ఎంపిక చేయడం సరికాదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించడానికి మేమెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపై దౌత్యపరంగా ప్రపంచ దేశాలను ఐక్యమత్యం చేసి ఆ దేశాన్ని ఏకాకిని చేయాలి’ అని సంతోశ్‌, నారాయణ సూచించారు.

Updated Date - May 19 , 2025 | 05:14 AM