Nimmala Ramanaidu: కడలిపాలయ్యే నీటినే వాడుకుంటాం
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:08 AM
తెలంగాణ నేతలు విజ్ఞులని.. సముద్రంలో కలుస్తున్న నీటినే వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఏపీ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

తెలంగాణ నేతలు విజ్ఞులు... అర్థం చేసుకుంటారు
రాజకీయ కారణాలతోనే బనకచర్లను వ్యతిరేకిస్తున్నారేమో: నిమ్మల
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నేతలు విజ్ఞులని.. సముద్రంలో కలుస్తున్న నీటినే వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఏపీ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాస్తవాలేంటో వారికీ తెలుసని.. అయితే ఎన్నికలు, ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండొచ్చని శుక్రవారం సచివాలయంలో మీడియాతో అన్నారు. ‘ఈరోజు ప్రధాని మోదీయే కాదు.. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా దుర్భిక్షాన్ని నివారించాలంటే నదుల అనునంఽధానంతోనే సాధ్యమని వారు చెప్పారు. అదే ఆచరిస్తున్నారు. ఆ దిశగానే మోదీ కూడా పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తున్నారు. సుప్రసిద్ధ ఇంజనీర్ కేఎల్ రావు కూడా నదుల అనుసంధానంలోనే దుర్భిక్షం నివారించవచ్చన్నారు. వందేళ్ల చరిత్రను చూస్తే ఏటా గోదావరి నుంచి 3,000 టీఎంసీల వరద సముద్రంలోకి వృధాగా పోతోంది. మేం కూడా గోదావరి జిల్లాలవాసులమే. వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా ఇవాళ్టికీ 11,000 నుంచి 15,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. ఏటా కడలి పాలవుతున్న 3,000 టీఎంసీల్లో 200 టీఎంసీలను మాత్రమే నదుల అనుసంధానానికి ఉపయోగించుకుంటాం. మా దిగువన ఎవరూ ఉపయోగించుకునేవారెవరూ లేరు. ఉప్పునీటిలో కలసి పోయే నీటిని సాగు, తాగుకు ఉపయోగించుకుంటాం. దయచేసి అర్థం చేసుకోవాలి’ అని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు.