Maoist Party: నంబాలను సజీవంగా పట్టుకుని చంపారు
ABN , Publish Date - May 27 , 2025 | 04:13 AM
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును భద్రతా బలగాలు సజీవంగా పట్టుకుని కాల్చి చంపినట్లు మావోయిస్టు కమిటీ ఆరోపిస్తోంది. 27 మంది నాయకులు ఆయనను కాపాడేందుకు ప్రాణాలు త్యాగం చేశారు.

విప్లవ ద్రోహుల సమాచారంతోనే..
కాపాడుకునేందుకు 27 మంది త్యాగం
ఐనా ఆయన్ని కాపాడుకోలేకపోయాం
తప్పించుకొని వెళ్లిపోవాలన్నా వినలేదు
25 వేల బలగాలతో 35 మందిమి
తలపడ్డాం.. మావోయిస్టు పార్టీ ప్రకటన
అమరావతి/చర్ల, మే 26 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును పోలీసు బలగాలు పట్టుకుని, కాల్చి చంపాయని మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ఆరోపించింది. విప్లవ ద్రోహుల కారణంగా అబూజ్మఢ్లో ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్ జరిగిందని పేర్కొంటూ.. కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట మీడియాకు ఓ లేఖను విడుదల చేసింది. ‘‘భద్రతాబలగాలు నంబాల కేశవరావును సజీవంగా పట్టుకుని, కాల్చిచంపాయి. ఈనెల 19 నుంచి 21 వరకు భీకరపోరు జరిగింది. మావైపు 35 మంది ఉంటే.. భద్రతాబలగాల వైపు 25 వేల మంది ఉన్నారు. వేల మంది మాపై ఊచకోతకు పాల్పడ్డారు. 60 గంటల పాటు చుట్టుముట్టి, నిర్బంధించారు. 10 గంటల వ్యవధిలో ఐదు ఎన్కౌంటర్లు జరిగాయి. నంబాలను కాపాడుకునేందుకు 27 మంది నాయకులు ప్రాణాలను త్యాగం చేశారు. నంబాలను సజీవంగా పట్టుకున్నారు. ఆ తర్వాత కాల్చి చంపారు. ఆయనను మేము కాపాడుకోలేకపోయాం. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఒక మృతదేహాన్ని మేము వెంట తీసుకెళ్లాం. మరో ఏడుగురు నేతలు సురక్షితంగా బయటపడ్డారు’’ అని ఆ లేఖలో వికల్ప్ తెలిపారు. ‘‘నంబాల రక్షణ దళంలో ఉన్న ఆరుగురు కీలక వ్యక్తులు పోలీసులకు సహకరించారు. అందుకే.. నంబాల ఉన్న ప్రాంతానికి డీఆర్జీ, ఇతర బలగాలు సులభంగా చేరుకున్నాయి.
భారత చరిత్రలోనే మే 21 చీకటి రోజు. ఎన్కౌంటర్కు నిరసనగా.. అమరవీరులను స్మరించుకుంటూ.. ‘షాహిద్ సంస్మరణ సభ’లను నిర్వహించాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. నంబాల అబూజ్మఢ్లోనే ఉన్నట్లు బలగాలు, నిఘావర్గాలకు ఆర్నెల్ల ముందే తెలుసన్నారు. ‘‘మొదట్లో నంబాలకు 60 మందితో పటిష్ఠ భద్రత ఉండేది. ఆపరేషన్ కగార్ తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదురవ్వడంతో.. భద్రతను 35కు కుదించాం. వ్యూహాత్మకంగా పలువురు పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేశాం. అయితే.. అలా లొంగిపోయిన వారిలో ఆరుగురు ద్రోహులు పోలీసులకు నంబాల సమాచారం ఇచ్చారు. నిజానికి 17వ తేదీనే బలగాలు చుట్టుముట్టాయి. అదే రోజు పీపీసీ కమిటీ సభ్యుడొకరు తన జీవిత సహచరితో కలిసి పారిపోయాడు. దాంతో.. ఏదో కుట్ర జరిగిందని మాకు అర్థమైంది. వెంటనే శిబిరాన్ని మార్చాం. అయినా.. 19వ తేదీన బలగాలు మాదాకా రాగలిగాయి. నంబాలను షెల్టర్ జోన్కు వెళ్లాలని కోరాం. ఆయన నిరాకరించారు. యువ నాయకత్వాన్ని కాపాడుకోవాలంటూ ఆయన ముందు నిలిచారు. ఆయనను కాపాడుకోవడంలో మేం విఫలమయ్యాం’’ అని వికల్ప్ వివరించారు.