Nadendla Manohar: 7 రోజుల్లో కోటి కుటుంబాలకు రేషన్
ABN , Publish Date - Jun 08 , 2025 | 02:36 AM
రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీని పునఃప్రారంభించిన వారం రోజుల్లోనే కోటికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

రేషన్ పంపిణీ చరిత్రలో ఇదో మైలురాయి: నాదెండ్ల
అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీని పునఃప్రారంభించిన వారం రోజుల్లోనే కోటికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర ప్రజాపంపిణీ చరిత్రలో ఇదొక గొప్ప మైలురాయి అని శనివారం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,46,21,232 మంది కార్డుదారులకు ఈ నెల 1నుంచి 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించగా.. శనివారం వరకు 7 రోజుల్లోనే 1,05,27,767 మంది కార్డుదారులు.. అంటే 72 శాతం కుటుంబాలు సరుకులు తీసుకున్నాయని వివరించారు. ప్రతినెలా 1 నుంచి 15 వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమకు అనుకూలమైన సమయాల్లో రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు మాత్రం వారి ఇళ్ల వద్దే సరుకులు అందించే బాధ్యతలను డీలర్లకే అప్పగించామని తెలిపారు. ఇప్పటివరకు 11,05,439 మందికి వారి ఇంటి దగ్గరకే సరుకులు తీసుకువెళ్లి అందించినట్లు వెల్లడించారు. రేషన్ డీలర్లు సేవా దృక్పథంతో పని చేయాలని సూచించారు.