Visakhapatnam Heatwave: రుతుపవనాల మందగమనం
ABN , Publish Date - Jun 04 , 2025 | 07:13 AM
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించినప్పటికీ నాలుగు రోజుల నుంచి మందగించాయి. కోస్తా ప్రాంతంలో వేడి వాతావరణం కొనసాగుతూ ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు పెరిగాయి.

తిరిగి కొనసాగుతున్న వేసవి పరిస్థితులు
ఈనెల పదో తేదీ తర్వాతే మళ్లీ పురోగతి
రాష్ట్రంలో 4 రోజులుగా వేడి వాతావరణం
విశాఖపట్నం, అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. నాలుగు రోజుల నుంచి మందగించాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్(కదలిక) బలహీనంగా ఉండడంతో ఈశాన్య భారతం తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరిగి వేసవి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తాలో కొన్నిచోట్ల సెగలు కక్కే వాతావరణం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకూ నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని సాయంత్రం పూట అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడోరోజైన మంగళవారమూ జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తాలో అనేకచోట్ల వేడి వాతావరణం నెలకొంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీలు, ఒకటిరెండుచోట్ల 40 డిగ్రీల వరకూ నమోదవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొద్దిరోజుల విరామం సాధారణమేనని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథకుమార్ చెప్పారు. ఈనెల 10 తర్వాతే బంగాళాఖాతంలో రుతుపవనాల కదలికకు అనువుగా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. 12 నుంచి రుతుపవనాల్లో మళ్లీ కదలిక రావచ్చునని వివరించారు. కాగా, బుధవారం కోస్తా జిల్లాల్లో ఉక్కపోతతోపాటు గరిష్ఠంగా 39-40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.