Minister Satya Kumar: ప్రభుత్వ వైద్యుని ప్రైవేటు చికిత్స
ABN , Publish Date - May 07 , 2025 | 07:20 AM
ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు వైద్యులు ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి, రోగి మరణానికి కారణమయ్యారు. మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు

రోగి మృతి... క్రమశిక్షణా చర్యలకు మంత్రి సత్యకుమార్ ఆదేశం
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో విఽధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేటు ఆసుపతిల్రో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన ఇద్దరు ప్రభుత్వ వైద్యులపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. 2022లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి.. ఇద్దరు వైద్యలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం.చక్రధర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాకేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాల్సిన సమయంలో ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోగికి శస్త్ర చికిత్స చేశారు. కొన్నిరోజుల తర్వాత రోగి మరణించాడు. దీనిపై మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణలపై వైద్యులు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ‘మేం మానవతా దృక్పథంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశాం. ఇందులో మా వైపు నుంచి ఎటువంటి తప్పూ లేదు. మా చర్యను క్షమించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని వివరణ ఇచ్చారు. మంత్రి వారి వివరణను తిరస్కరించారు.