Share News

Minister Satya Kumar : పీపీపీ మోడల్‌తో నష్టం లేదు

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:17 AM

వైద్య కళాశాలలపై బుధవారం శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. కొత్త వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తామని, ప్రైవేటీకరణ కాదని మంత్రులు స్పష్టం చేశారు.

Minister Satya Kumar : పీపీపీ మోడల్‌తో నష్టం లేదు

  • వైద్య కాలేజీల్లో మెరుగైన సౌకర్యాలు

  • ఫీజులు కూడా పెరగవు: సత్యకుమార్‌, అచ్చెన్న

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలలపై బుధవారం శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. కొత్త వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తామని, ప్రైవేటీకరణ కాదని మంత్రులు స్పష్టం చేశారు. దీనివల్ల ఫీజులు పెరగబోవని, యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయని చెప్పారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ సమాధానమిస్తూ.. కేంద్రం రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు మంజూరు చేస్తే.. గత ఐదేళ్లలో 4 కాలేజీలు కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. మెడికల్‌ కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ స్కీం తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేననన్నారు. వారు తెచ్చిన విధానాన్ని.. ఎప్పుడు రద్దు చేస్తారని వారే అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే తాము 10 మెడికల్‌ కాలేజీలను పీపీపీ మోడల్‌లో నిర్మించాల్సి వస్తోందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం లేదని.. ప్రైవేటీకరణకు, పీపీపీ మోడల్‌కు మధ్య తేడా ఉందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తున్నారని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. పీపీపీ మోడల్‌ వల్ల సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు పెరుగుతాయని, నిపుణులైన అధ్యాపకులు వస్తారన్నారు. ఫీజులు కూడా పెరగవన్నారు.

సుప్రీం తీర్పునకు లోబడే...: సత్యకుమార్‌

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఒప్పంద ప్రాతిపదికపై నియమితులైన ఎంపీహెచ్‌ఏ పారామెడికల్‌ సిబ్బంది తొలగింపు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. కొన్ని దశాబ్దాలుగా వైద్యారోగ్యశాఖలో ఎంపీహెచ్‌ఏ పారామెడికల్‌ సిబ్బంది సేవలందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు. న్యాయ పరిమితులకు లోబడి వారి సమస్యలు పరిష్కరించాలని సీఎం సూచించారన్నారు.

Updated Date - Mar 06 , 2025 | 05:17 AM