Liquor Scam Investigation: మద్యం కుంభకోణంలో ఈడీ పిటిషన్పై విచారణ వాయిదా
ABN , Publish Date - May 20 , 2025 | 05:02 AM
మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. గోవిందప్ప కస్టడీ, సజ్జల శ్రీధర్రెడ్డి బెయిల్ పిటిషన్లపై కోర్టు తీర్పును వాయిదా వేసింది.

నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు
గోవిందప్ప కస్టడీపై తీర్పు రిజర్వు
‘సజ్జల’ బెయిల్పై విచారణ వాయిదా
విజయవాడ, మే 19(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు అనుమతి కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రాజశేఖర్రెడ్డికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడు, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఏసీబీ కోర్టు మంగళవారానికి రిజర్వ్ చేసింది. గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో నిందితుడు, విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఇక ఈ కేసులో కసిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు పైలా దిలీప్ బెయిల్ పిటిషన్పై సిట్ అధికారులు సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై వాదనలను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.