Visakhapatnam: కృష్ణంరాజు అరెస్టు
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:51 AM
జగన్ చానల్ డిబేట్లో అమరావతి ప్రాంత మహిళలను తీవ్రంగా కించపరుస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ1, సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.

అమరావతిపై అసభ్య వ్యాఖ్యల కేసులో అదుపులోకి
కేసు నమోదుతో అజ్ఞాతవాసం.. శ్రీకాకుళం నుంచి వస్తుండగా పట్టుకున్న విశాఖ పోలీసులు
రోడ్డు మార్గంలో తుళ్లూరుకు తరలింపు.. నేడు మంగళగిరి కోర్టులో హాజరు
విశాఖపట్నం/గుంటూరు, జూన్ 11(ఆంధ్రజ్యోతి): జగన్ చానల్ డిబేట్లో అమరావతి ప్రాంత మహిళలను తీవ్రంగా కించపరుస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ1, సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కృష్ణంరాజు ఫార్చునర్ వాహనంలో శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వస్తున్నట్టు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులు విజయనగరం పోలీసులతో పాటు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీని అప్రమత్తం చేశారు. కృష్ణంరాజు ప్రయాణిస్తున్న కారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దాటి విశాఖపట్నం జిల్లా భీమిలి మండల పరిధిలోని అమనాం జంక్షన్కు చేరుకుంది. అప్పటికే అక్కడ మాటువేసిన భీమిలి పోలీసులు ఆ వాహనాన్ని ఆపి, అందులో ఉన్న కృష్ణంరాజుతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తుళ్లూరు పోలీసులకు అప్పగించారు. దీంతో కృష్ణంరాజును రోడ్డుమార్గంలో బుధవారం రాత్రికి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. సాక్షి టీవీ చానల్లో ఈ నెల 6న నిర్వహించిన డిబేట్లో జర్నలిస్టు కృష్ణంరాజు రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మహిళలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే తుళ్లూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇది తెలుసుకున్న కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్లో ఉన్నారు.