Vamsi Relief: ఆ కేసులో వంశీకి బిగ్ రిలీఫ్
ABN , Publish Date - May 29 , 2025 | 02:54 PM
Vamsi Relief: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది నూజివీడు కోర్టు. వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో రెండో సారి పిటిషన్ దాఖలు చేశారు.

విజయవాడ, మే 29: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Former MLA Vallabhaneni Vamsi) ఊరట లభించింది. వంశీని రెండో సారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది నూజివీడు కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని రెండోసారి కస్టడీకి ఇవ్వాలంటూ హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టును కోరారు. మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఈ పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. గతంలో ఇదే కేసులో రెండు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారని వంశీ తరపు న్యాయవాది వాదించారు.
అయితే కస్టడీకి తీసుకున్న సమయంలో వంశీ అస్వస్థతకు గురయ్యారని, దీంతో విచారణ సరిగా జరగలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రెండు రోజుల్లో ఏం విచారణ చేశారో చెప్పాలని పోలీసులను ఆదేశిస్తూ నేటికి విచారణను వాయిదా వేసింది. ఈరోజు మరోసారి విచారణకు రాగా.. గతంలో ఒకసారి ఇదే కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వటంతో తాజా పిటిషన్ను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
మళ్లీ షాక్
ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నేటితో (గురువారం) వంశీకి రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. ఈ క్రమంలో వంశీకి జూన్ 12 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
నూజివీడు కోర్టులో మరో పిటిషన్
మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించడానికి అనుమతి ఇవ్వాలని నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కారణంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని పిటిషన్లో కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.
పోలీస్ కస్టడీకి వంశీ అనుచరుడు
ఇక.. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగాను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈరోజు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్న పోలీసులు.. రంగాను జిల్లా జైలు నుంచి గన్నవరం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రంగాను పోలీస్స్టేషన్కు తరలించారు. నేడు, రేపు రెండు రోజుల పాటు రంగాను పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు.
ఇవి కూడా చదవండి
పోలీస్ థీమ్ యోగా.. పాల్గొన్న 5 వేల మంది పోలీసులు
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest AP News And Telugu News