Vamsi Custody Case: వంశీ కస్టడీపై విచారణ.. నూజివీడు కోర్టు ఏం చెప్పిందంటే
ABN , Publish Date - May 27 , 2025 | 04:50 PM
Vamsi Custody Case: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు రెండో సారి పిటిషన్ వేశారు. రెండు రోజులు వంశీ అస్వస్థతకు గురవడంతో సరిగా విచారణ జరగలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు.

విజయవాడ, మే 27: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) కస్టడీ పిటిషన్పై నూజివీడు కోర్టులో (Nuziveedu Court) ఈరోజు (మంగళవారం) విచారణ జరిగింది. వంశీ అస్వస్థతకు గురికావడంతో సరిగా విచారణ జరగలేదని కోర్టుకు పోలీసులు తెలిపారు. దీంతో రెండు రోజుల్లో ఏం విచారణ చేశారో చెప్పాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ నూజివీడు కోర్టులో హనుమాన్ జంక్షన్ పోలీసులు రెండో సారి పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. గతంలో రెండు రోజులు ఇదే కేసులో కస్టడీకి తీసుకొని విచారణ చేశారని వంశీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే ఆ రెండు రోజులు వంశీ అస్వస్థతకు గురవడంతో సరిగా విచారణ జరగలేదని కోర్టుకు తెలియజేశారు పోలీసులు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం... రెండు రోజుల్లో ఏం విచారణ చేశారో తెలపాలని పోలీసులను ఆదేశించింది. విచారణ అనంతరం నూజివీడు కోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది. మరోవైపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వంశీ పిటిషన్ వేశారు. అయితే అత్యవసరంగా విచారించలేమని.. ఈనెల 29న (గురువారం) విచారణ చేపడుతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా.. వంశీ ఇప్పటికే పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రధానంగా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్థన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో వంశీకి బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. అయితే నూజివీడు కోర్టులో తాజాగా ఓ కేసు నమోదు అయ్యింది. అందులో వంశీ రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలు అందజేసి మోసం చేశారంటూ వంశీపై అభియోగాలు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి రెండు రోజుల పాటు కస్టడీకి కోరగా.. న్యాయాధికారి అందుకు అంగీకరించారు. కానీ కస్టడీలో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ క్రమంలో వంశీ అనారోగ్యం కారణంగా విచారణకు సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ నూజివీడు కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ రెండు రోజుల్లో వంశీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే దానిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఇదే సమయంలో తన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వంశీ పిటిషన్ వేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే అత్యవసరంగా విచారణ చేయలేమంటూ హైకోర్టు న్యాయమూర్తి గురువారానికి ఈ కేసు విచారణను వాయిదా వేశారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఓవైపు బెయిల్ కోసం వంశీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. వంశీని కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
Lokesh Statements: అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News