Pawan On Floods: ముందస్తు చర్యలతో నష్టం తగ్గింది: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:45 PM
ప్రజలకు ఎలర్ట్ మెసేజ్లు కూడా పంపామని.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. ప్రతి జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేశారని కొనియాడారు.
కృష్ణా జిల్లా, అక్టోబర్ 30: జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పర్యటన కొనసాగుతోంది. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. మొంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ముందస్తుగా తీసుకున్న చర్యలతో నష్ట నివారణ కొంత వరకు తగ్గించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు ఎలర్ట్ మెసేజ్లు కూడా పంపామని.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగిందని వెల్లడించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం బాగా పని చేసిందని కొనియాడారు.

మొంథా తుపాను ప్రభావంతో 46 వేల హెక్టార్లలో వరి, 14 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బ తిన్నాయని వెల్లడించారు. చెట్టు మీద పడి కోయ సుబ్బారావు అనే వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఇళ్లకు వెళ్లే సమయంలో కూడా ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. డ్రైన్ల పూడికతీతల ద్వారా నీరు నిల్వ లేకుండా చేశామన్నారు. ముందస్తుగా తీసుకున్న చర్యల వల్ల నేడు నష్టం చాలా వరకు తగ్గిందని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఆక్వా రైతుల ఇబ్బందులు తన దృష్టి కి వచ్చాయని.. సీఎం చంద్రబాబుతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో రోడ్లు పాడైతే యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామన్నారు. రెండు రోజుల్లో మొత్తం చెత్తను క్లీన్ చేసేలా వేలాది మంది సిబ్బంది పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సమిష్టి కృషితో ఒడ్డుకు చేరిన భారీ బోటు.. యంత్రాంగానికి అభినందన వెల్లువ
వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే
Read Latest AP News And Telugu News