Supreme Court: జాగ్రత్తగా ఉండండి
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:37 AM
రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్లో ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయనివ్వొద్దని సాక్షి చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును సుప్రీంకోర్టు హెచ్చరించింది.

అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు
డిబేట్లోని వారూ చేయకూడదు
సాక్షి యాంకర్ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక
రాజధానిపై అసభ్య వ్యాఖ్యల కేసులో జైలు నుంచి విడుదలకు ఆదేశం
ట్రయల్ కోర్టు షరతులకు లోబడి బెయిల్
న్యూఢిల్లీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్లో ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయనివ్వొద్దని సాక్షి చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును సుప్రీంకోర్టు హెచ్చరించింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్లో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేసింది. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సి అవసరం ఉందని, ఆయన వాక్స్వాతంత్ర్యాన్ని, జర్నలిస్టు హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విఽధించే షరతులకు లోబడి బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. సాక్షి చానల్లో ఈ నెల 6న జరిగిన చర్చలో అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఎనలిస్టు కృష్ణంరాజు దారుణ వ్యాఖ్యలు చేశారు. ఈ డిబేట్ను నిర్వహించిన కొమ్మినేని ఆ వ్యాఖ్యలను సమర్థించేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై తుళ్లూరు పొలీసుస్టేషన్లో నమోదైన కేసులో ఆయన్ను 9న పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 24 వరకు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ కింది కోర్టులో విచారణలో ఉండగానే కొమ్మినేని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. రాష్ట్రప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రా, కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవే, పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. కొమ్మినేని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, లైవ్ డిబేట్లో మరొకరు చేసిన వ్యాఖ్యలకు ఆయన్ను బాధ్యుడిని చేయలేమని దవే అన్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ప్రోత్సహించారని, నవ్వుతూ వాటిని సమర్థించేలామాట్లాడారని రోహత్గీ, లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఇతరులు చేసిన వ్యాఖ్యలకు పిటిషనర్ను ఎలా అరెస్టు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. ‘ఎవరైనా అసభ్యమైన వ్యాఖ్య చేస్తే.. మనం దానిని నవ్వుతూ తేలికగా తీసుకుంటాం. వారిని సహకుట్రదారులుగా పరిగణించలేం’ అని జస్టిస్ మన్మోహన్ పేర్కొన్నారు. దీనితో జస్టిస్ మిశ్రా ఏకీభవించారు. కొమ్మినేనిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 8 వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది.
అక్రమ అరెస్టు అని తేలింది: జగన్
అమరావతి మహిళల పేరిట నిరసనలతో అరాచకం చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాసరావుకు ఆపాదించి దానిచుట్టూ విషప్రచారం చేయించారని ట్వీట్ చేశారు. చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా డిబెట్లో చేసిన వ్యాఖ్యలను సాక్షి మీడియాకు ఆపాదించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ‘‘కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు కుట్రలను ఎండగట్టాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వచ్చింది’’ అని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో బెయిల్ వస్తే అక్రమ కేసయితే, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్దన్రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి తదితరులకు బెయిల్ రాలేదని అంటే ఈ అరెస్టులన్నీ సక్రమమేనని వైసీపీ అధినేత అంగీకరించినట్లేనా అన్న చర్చ వైసీపీలోనే మొదలైంది.