Share News

Kommineni Srinivasa Rao: ఆ వ్యాఖ్యల వెనుక కుట్ర

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:49 AM

అమరావతి మహిళలను దారుణంగా అవమానిస్తూ.. సాగిన డిబేట్‌కు సంబంధించి సాక్షి చానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళవారం మంగళగిరి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్‌ విధించారు.

Kommineni Srinivasa Rao: ఆ వ్యాఖ్యల వెనుక కుట్ర

  • సమాజంలో అలజడికి పన్నాగం

  • ఖండించాల్సిన కొమ్మినేని ప్రోత్సహించారు

  • వాదనలు వినిపించిన స్పెషల్‌ కౌన్సెల్‌

  • కొమ్మినేనికి రిమాండ్‌.. జైలుకు తరలింపు

  • కృష్ణంరాజు చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలను మీరెందుకు ఖండించలేదు?

  • మిమ్మల్ని ఎందుకు వదిలి పెట్టాలి?

  • జడ్జి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన కొమ్మినేని

  • అట్రాసిటీ సెక్షన్లపై కోర్టు అభ్యంతరం

‘‘రాజధాని చుట్టూ వేశ్యలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్థులు ఉన్నారని దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.. మీరెందుకు వాటిని ఖండించలేదు. హిందూ దేవతలు, ముస్లిం దేవతలు, క్రిస్టియన్‌ దేవతలు అంటూ నవ్వుతూ వ్యంగ్యంగా మాట్లాడడం.. కృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రోత్సహించినట్లే కదా!. అందువల్ల మీరు శిక్షార్హులే. మిమ్మల్ని ఎలా వదిలి పెట్టాలి?.’’

- కొమ్మినేనిని ఉద్దేశించి న్యాయాధికారి వ్యాఖ్యలు

గుంటూరు, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలను దారుణంగా అవమానిస్తూ.. సాగిన డిబేట్‌కు సంబంధించి సాక్షి చానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళవారం మంగళగిరి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మేజిస్ట్రేట్ రిమాండ్‌ విధించారు. ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించడంతో కొమ్మినేనిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. సాక్షి చానల్‌లో ఈ నెల 6న జరిగిన చర్చలో.. ‘‘అమరావతి దేవత రాజధాని కాదు.. వేశ్యల రాజధాని.’’ అంటూ ఎనలిస్టు కృష్ణంరాజు దారుణ వ్యాఖ్యలు చేశారు. ఈ డిబేట్‌ను నిర్వహించిన యాంకర్‌ కొమ్మినేని సదరు వ్యాఖ్యలను ఖండించకపోగా ‘అవును.. నిజమే’ అన్నట్లుగా సమర్థించారు. ఈ వ్యాఖ్యలపై మహిళాలోకం తీవ్ర అగ్రహావేశాలకు లోనైంది. ఈ క్రమంలో రాజధాని ప్రాంత దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష ఈ నెల 8న తుళ్లూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణంరాజును ఏ1గా, కొమ్మినేని శ్రీనివాసరావును ఏ2గా, సాక్షి యాజమాన్యాన్ని ఏ3గా పేర్కొన్నారు. కేసు విచారణాధికారి టి.మురళీకృష్ణ సాక్షులను విచారించిన అనంతరం 9న కొమ్మినేనిని హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కొమ్మినేనిని పోలీసులు సోమవారం రాత్రి గుంటూరులోని నల్లపాడు పోలీస్‌ ేస్టషన్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం, మంగళగిరి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. కొమ్మినేని తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, వైసీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది మనోహర్‌ రెడ్డితోపాటు పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా, ప్రాసిక్యూషన్‌ తరఫున వీరగంధం రాజేంద్రప్రసాద్‌, మంగళగిరి కోర్టు ఏపీపీ శివలీల వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి కె. సురేశ్‌బాబు నిందితుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు 24 వరకు రిమాండ్‌ విధించారు.


రిమాండ్‌ విధించండి: స్పెషల్‌ కౌన్సెల్‌

రాజధాని మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును రిమాండ్‌ నుంచి తప్పించేందుకు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తదితరులు తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ప్రకారం ఏడేళ్లలోపు శిక్షలు పడే నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు 41ఏ నోటీసు జారీ చేయాలని, రిమాండ్‌ విధించకూడదని పొన్నవోలు వాదించారు. అయితే ఏడేళ్లలోపు శిక్ష పడే కేసు అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా రిమాండ్‌ విధించవచ్చునని పలు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లను స్పెషల్‌ కౌన్సెల్‌ రాజేంద్రప్రసాద్‌ కోర్టు ముందు ఉంచారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు.. విభేదాలు సృష్టించేందుకు జరిగిన కుట్రను చేదించాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. దురుద్ద్గేశపూరితంగా కుట్ర ప్రకారం జరిగిన లైవ్‌ డిబేట్‌కు సంబంధించిన కేసులో సమగ్రంగా విచారణ జరపాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఏ1 నిందితుడు కృష్ణంరాజు పరారీలో ఉన్నారని, ఈ తరుణంలో రెండో నిందితుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్‌ ఇస్తే ఆయన సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్నారు. మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారని, ఈ దశలో రిమాండ్‌ విధించకుంటే ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కొమ్మినేనికి రిమాండ్‌ విధించకుంటే కోర్టులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.


వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కోర్టు

సాక్షి టీవీలో ప్రసారమైన లైవ్‌ డిబేట్‌లో రాజధాని ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. కృష్ణంరాజు నీచాతినీచంగా మాట్లాడితే కొమ్మినేని దానిని ఖండించకపోగా, ప్రోత్సహించినట్లుగా మాట్లాడారని రాజేంద్రప్రసాద్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సాక్షిలో ప్రసారమైన 15 నిమిషాల నిడివిగల కార్యక్రమాన్ని ల్యాప్‌టా్‌పలో మేజిస్ట్రేట్‌కు చూపారు. ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత.. వారు చేసిన వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా పరిగణించింది.

పొన్నవోలు చిందులు..

కొమ్మినేని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొమ్మినేనికి రిమాండ్‌ విధించడంతో పొన్నవోలు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘‘మా వాదనలు పూర్తిగా వినకుండానే రిమాండ్‌ విధించడం అన్యాయం, అక్రమం, అధర్మం.’’ అంటూ చిందులు తొక్కారు. స్పెషల్‌ కౌన్సెల్‌ రాజేంద్రప్రసాద్‌ జోక్యం చేసుకుని ఒకసారిరిమాండ్‌విధించిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం లేదంటూ.. వాదన వినిపిస్తుండగా... పొన్నవోలు తీవ్ర అసహనంతో రగిలిపోయారు. స్పెషల్‌ కౌన్సిల్‌ను.. ‘‘నోరు మూసుకో... ఏం మాట్లాడుతున్నావ్‌!’’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దీంతో రాజేంద్రప్రసాద్‌ స్పందిస్తూ.. ‘‘ఏం మాట్లాడుతున్నావ్‌.. నన్ను బెదిరిస్తున్నావా.. జాగ్రత్తగా ఉండు.’’ అంటూ హెచ్చరించారు. పొన్నవోలు తీరుపై మేజిస్ట్రేట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు కోర్టులో ఉన్నారనే విషయం గుర్తుంచుకోండి. ఇది చేపల మార్కెట్‌ కాదు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.’’ అంటూ హెచ్చరించారు. దీంతో గొంతు సవరించుకున్న పొన్నవోలు.. ‘‘నా వాదనలు సమగ్రంగా వినిపించాల్సి ఉంది.’’ అని చెప్పడంతో.. భోజన విరామం తర్వాత వాదనలు వింటామని చెప్పారు. భోజన విరామం అనంతరం పొన్నవోలు ముంబై కోర్టు జడ్జిమెంట్‌ను కోర్టు ముందుంచారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే నేరాలకు సంబంధించిన కేసుల్లో రిమాండ్‌ విధించడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే ఆయన వాదనల పట్ల సంతృప్తి చెందని మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.


అట్రాసిటీ చట్టంపై అభ్యంతరం

సాక్షి టీవీ చర్చలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో అట్రాసిటీ సెక్షన్‌ నమోదు చేయడంపట్ల న్యాయాధికారి సురేశ్‌ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సెక్షన్లను ఎలా నమోదు చేస్తారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణను నిలదీశారు. గతంలోనూ తాను ఒకసారి చెప్పానని అయినప్పటికీ మళ్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌ను జోడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏ ప్రాతిపదికన అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆ సెక్షన్‌ను మినహాయించి మిగిలిన సెక్షన్లను పరిగణనలోకి తీసుకుని కొమ్మినేనికి రిమాండ్‌ విధించారు.

పకడ్బందీగా రిమాండ్‌ రిపోర్ట్‌

కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా స్పెషల్‌ కౌన్సిల్‌ రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో తుళ్లూరు పోలీసులు పకడ్బందీగా రిమాండ్‌ రిపోర్ట్‌ రూపొందించారు. ఈ కేసులో పేర్కొన్న సెక్షన్లకు సంబంధించిన సమగ్ర వివరాలను కూడా కోర్టు ముందు ఉంచారు.

బీఎన్‌ఎస్‌ 79: మహిళలను ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడుతూ కించపరచడం నేరం. ఈ సెక్షన్‌ కింద మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

బీఎన్‌ఎస్‌ 196(1): సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచాలని, కలహాలు సృష్టించాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా నేరానికి పాల్పడడం. మూడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

బీఎన్‌ఎస్‌ 353(2): అభూత కల్పనలను సృష్టించి గొడవలు పెట్టాలనే దురుద్దేశం. నేరం రుజువైతే మూడేళ్లకు తక్కువ కాకుండా శిక్ష. సమాజంలో అలజడి సృష్టించాలనే దురుద్దేశంతో ఒక పధకం ప్రకారం గొడవలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్పించాలనే ఉద్దేశం.


అందువల్ల.. మీరు శిక్షార్హులే!

కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు కొమ్మినేని శ్రీనివాసరావు నీళ్లు నమిలారు. ‘‘డిబేట్లో మీరు యాంకర్‌గా ఉన్నప్పుడు, ఏయే విషయాలు ప్రస్తావించాలి? ఏయే అంశాలను అనుమతించాలి? వీటిని ఎక్కడ కట్‌ చేయాలి అనేది మీ పరిధిలోనే ఉంటుంది కదా. వేశ్యలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు రాజధాని చుట్టూ ఉన్నారని ఇంత దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు.. మీరెందుకు వాటిని ఖండించలేదు. అంతేగాక హిందూ దేవతలు, ముస్లిం దేవతలు, క్రిస్టియన్‌ దేవతలు అంటూ నవ్వుతూ వ్యంగ్యంగా మాట్లాడడం.. కృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రోత్సహించినట్లే కదా!. అందువల్ల మీరు శిక్షార్హులే. మిమ్మల్ని ఎలా వదిలి పెట్టాలి?.’’ అని జడ్జి ప్రశ్నించారు. దీంతో.. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక కొమ్మినేని కొద్దిసేపు నీళ్లు నమిలారు. ‘‘నేనేమీ మాట్లాడలేదు. నా తప్పేమీ లేదు.’’ అని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే జడ్జి మాత్రం ఆ వ్యాఖ్యలను సీరియ్‌సగా పరిగణించి రిమాండ్‌ విధించారు.

Updated Date - Jun 11 , 2025 | 06:47 AM