Kethi Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెబుతా.!
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:09 PM
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడూ దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలు అబద్దపు ప్రచారమేనని పేర్కొన్నారు.

అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడూ దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలు అబద్దపు ప్రచారమేనని పేర్కొన్నారు. జేసీ భార్య ఉమ అక్కను తాను ఎక్కడైనా తిట్టినట్టు, దూషించినట్టు నిరూపిస్తే, తాను స్వయంగా జేసీ ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అభ్యంతరం ఏంటి?
వైసీపీ తాడిపత్రి సమావేశంలో తన కోడలు పాల్గొనడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేతిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఇదేం సంస్కారం అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఉందని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఉన్న కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమని టీడీపీ నేతలు చెబుతున్నారని, కానీ, అవన్నీ చట్టబద్ధమైన కేసులేనని కేతిరెడ్డి స్పష్టం చేశారు.
న్యాయం కావాలంటే..
సుప్రీం కోర్టు నిషేదించిన BS-3 వాహనాలను స్క్రాప్గా కొనుగోలు చేసి జేసీ ట్రావెల్స్లో తిప్పారని, ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా నాగాలాండ్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. జేసీ ట్రావెల్స్ డైరెక్టర్లుగా కుటుంబ సభ్యులు ఉండటంతో, వారిపై కూడా కేసులు నమోదయ్యాయని వివరించారు. జేసీకి న్యాయం కావాలంటే, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేషే చేయాలన్నారు. ఈ కేసులు ఎవరు పెట్టారు? ఏ విచారణ సంస్థ పెట్టిందో ఓసారి చంద్రబాబు, లోకేష్ లిస్ట్ తెప్పించుకొని చూసుకోవాలని, తమ మీద నిందలు మోపడం ఆపాలని కోరారు. ప్రజాస్వామ్యంలో చట్టపరమైన ప్రక్రియలకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
దుర్మార్గం
తాడిపత్రి ఏఎస్పీ రోహిత్, అనంతపురం డీపీఓలపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏఎస్పీ అవినీతి పరుడని చెప్పడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, అవినీతి డబ్బు జేసీ ఇంటికే చేరింది కాబట్టే, తాడిపత్రిలో రైతులతో చేపట్టనున్న ధర్నాను విరమించుకున్నారా? అంటూ ప్రశ్నించారు.