Quartz Mining Scam: ముగిసిన కాకాణి కస్టడీ
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:31 AM
క్వార్ట్జ్ అక్రమ తవ్వకం-రవాణా కేసులో ఏ-4గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డికి మూడ్రోజుల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది.

నెల్లూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరచిన పోలీసులు
నెల్లూరు(క్రైం), జూన్ 8(ఆంధ్రజ్యోతి): క్వార్ట్జ్ అక్రమ తవ్వకం-రవాణా కేసులో ఏ-4గా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డికి మూడ్రోజుల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగిసింది. కోర్టు అనుమతితో ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటలకు నెల్లూరు కేంద్ర కారాగారంలో ఆయన్ను జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన్ను నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు విచారించారు. తొలిరోజు 2 గంటలకుపైగా, రెండో రోజు 5గంటలకు పైగా ప్రశ్నించారు. పోలీసు అధికారులు ఏమడిగినా.. ‘నాకు తెలియదు.. నాకు సంబంధం లేదు.. మా లాయర్తో మాట్లాడుకోండి’ అని ఆయన సమాధానామిచ్చారు. ఎలాగూ ఆయన జవాబులివ్వడం లేదని.. ఆదివారం పోలీసులు అసలు విచారించలేదని సమాచారం. మధ్యాహ్నం కృష్ణపట్నం పోలీసు స్టేషన్ నుంచి నెల్లూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టుకు కాకాణిని తీసుకెళ్లారు. అక్కడ న్యాయాధికారి ఎదుట హాజరుపరచి.. సాయంత్రం 6.10 గంటల సమయంలో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. రెండ్రోజుల విచారణలో చెప్పిన సమాధానాలతో పోలీసులు ఫైల్ తయారు చేశారు. కాగా.. కాకాణి బెయిల్ పిటిషన్ సోమవారం కోర్టులో విచారణకు రానుంది.