Share News

AP Deputy CM:జమిలితో దేశ ప్రగతి

ABN , Publish Date - May 27 , 2025 | 04:03 AM

జమిలి ఎన్నికలు దేశ అభివృద్ధికి మద్దతుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉన్నట్లు సూచించారు.

AP Deputy CM:జమిలితో దేశ ప్రగతి

  • ఇది భారత జీడీపీకి ఊతమిచ్చే విధానం

  • ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ను కరుణ కోరుకున్నారు

  • ఆయన నిర్ణయాన్ని స్టాలిన్‌ వ్యతిరేకిస్తే ఎలా?

  • జమిలిపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం

  • అవసరమైతే తమిళనాట ఎన్నికల ప్రచారం

  • ఈసారి ఇక్కడ ఎన్‌డీఏ కూటమిదే విజయం

  • చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

చెన్నై, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ విధానం దేశ ప్రగతికి చేయూతనిచ్చే సంస్కరణ అని, ఇది దేశ జీడీపీకి ఊతమిచ్చే విధానమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అనే అంశంపై చెన్నైలో సోమవారం జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించిన పవన్‌ కల్యాణ్‌.. అనంతరం విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు దేశానికి అవసరమైన మార్పని అన్నారు. ఎన్నికలనేవి ఒక నిరంతర ప్రక్రియలా మారి దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయని, తరచూ ఎన్నికల నిర్వహణతో భారీ ఖర్చుతో పాటు సమయం కూడా వృథా అవుతుందని అన్నారు. ఒక ప్రభుత్వ ఐదేళ్ల పాలనా కాలంలో దాదాపు 800 రోజులు ఎన్నికల నిర్వహణకే కేటాయించాల్సి వస్తోందని గుర్తు చేశారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప.. ఎలాంటి నష్టం ఉండదన్నారు. భారత్‌లో జమిలి ఎన్నికల ఆచరణ సాధ్యమేనని వ్యాఖ్యానించారు. కానీ తమిళనాట ఈ వ్యవహారంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇండియా కూటమి పక్షాలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. జమిలి ఎన్నికలు కావాలని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గతంలో బలంగా కోరుకున్నారని, ‘నెంజిక్కు నీది’ పుస్తకంలో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారని పవన్‌ తెలిపారు. కానీ.. ఆయన సమర్థించిన ఈ వ్యవహారాన్ని ఆయన కుమారుడైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలినే వ్యతిరేకించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా జమిలి ఎన్నికలు అంటుంటే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.


ఇప్పటికైనా స్టాలిన్‌ ఈ వ్యవహారంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో ఓడిపోయిందని గుర్తు చేస్తూ.. గెలిచినప్పుడు తమ గొప్పగా ప్రకటించుకున్న వైసీపీ.. ఓడిపోతే మాత్రం ఈవీఎంలు ట్యాంపర్‌ అయ్యాయంటూ అసత్య ప్రచారం చేసిందన్నారు. ఎన్నికల్లో గెలిచినపుడు ఈవీఎంలు సూపర్‌ అని, ఓడినపుడు ట్యాంపర్‌ అని గగ్గోలు పెట్టడం ఎంతమేరకు న్యాయమని ప్రశ్నించారు. తాను చాలాకాలం చెన్నైలోనే ఉన్నానని, తమిళనాడును వీడి మూడు దశాబ్దాలు దాటినా తనను ఈ గడ్డ వదలడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘నాపై ఈ నేల ప్రభావం చాలా ఎక్కువ. తిరుక్కురళ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు సినిమా ప్రభావం నాపై ఎక్కువగా ఉండటానికి చెన్నైలో నివశించడమే కారణం. తమిళనాడు నేర్పిన పాఠాలు జీవితాంతం నాకు స్ఫూర్తి కలిగిస్తాయి’’ అని పవన్‌ అన్నారు. జమిలి అప్రజాస్వామికమని, దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుందన్న వాదన నిజం కాదన్నారు.


జనసేనను విస్తరించాలన్న ఆలోచన లేదు

పార్టీ అధినేతగా ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సింది నటుడు విజయ్‌యేనని పవన్‌ అన్నారు. ఎవ్వరినీ అనుసరించకపోవడం ఆయనకు మంచిదన్నారు. నటుడిగా రాణించడం వేరు... నటుడు రాజకీయాల్లో రాణించడం వేరని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్‌ని రప్పించడంపై ఇప్పటివరకూ ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ఎన్‌డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం తన బాధ్యత అని, గతంలో మహారాష్ట్ర, కర్నాటక ఎన్నికల్లోనూ ప్రచారం చేశానని గుర్తు చేశారు. అవసరమైతే తమిళనాడు ఎన్నికల్లో కూడా ఎన్‌డీఏ కూటమికి ప్రచారం చేస్తానన్నారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎన్‌డీఏ కూటమి విజయం తధ్యమని పేర్కొన్నారు. దేశానికి సేవ చేసుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతూ.. జనసేనను ఇతర రాష్ట్రాలకు విస్తరించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌, మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 04:04 AM